దేవుడా..: హైవే పై హాహాకారాలు
Delhi-Agra Expressway: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఈ తెల్లవారు జామున దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. పలు వాహనాలు మంటల బారిన పడ్డాయి. అగ్ని కీలలకు అహూతి అయ్యాయి. ఒకదాని వెంట ఒకటిగా మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు సజీవదహనం అయ్యారు. 150 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
మొత్తం ఏడుకు పైగా బస్సులు, నాలుగు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. పొగమంచు వల్ల ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో ఒకదానికొకటి ఢీ కొట్టాయి ఆయా వాహనాలన్నీ కూడా. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ప్రమాదానికి గురైన వాహనాలన్నింటికీ అగ్నికీలలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక, ఎన్హెచ్ఏఐ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఆయా వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొస్తోన్నారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తోన్నారు. ఒకవైపు మండుతున్న వాహనాలు, మరో వైపు బాధితుల హాహాకారాలతో ఎక్స్ ప్రెస్ వే పై భీతావహ వాతావరణం నెలకొంది. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రులకు తరలించడానికి ఏకంగా 26 అంబులెన్సులను తీసుకుని రావాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో ఈ మార్గంలో వాహనాల రాకపోకలన్నీ కూడా స్తంభించాయి.
ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా బల్ దేవ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. 127 కిలోమీటర్ మైలురాయి వద్ద ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో వాహనాలు మంటల బారిన పడ్డాయి. తొలుత ఓ బస్సును వెనుక వైపు నుంచి వచ్చిన ఓ వాహనం ఢీ కొట్టింది. దాని వెనుకే వస్తోన్న మరో బస్సు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. ఇలా మొత్తం ఏడు బస్సులు, నాలుగు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. క్షణాల్లో వ్యాప్తి చెందాయి.
#WATCH | Mathura, UP | Several buses catch fire on the Delhi-Agra Expressway. Casualties feared. Further details awaited. pic.twitter.com/9J3LVyeR3P
— ANI (@ANI) December 16, 2025
చలి తీవ్రత, దట్టమైన పొగమంచు కారణంగా ముందు వెళ్తోన్న వాహనాలేవీ కూడా కనిపించని పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొంది. ఫలితంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సోమవారం నాడు రోహ్ తక్ జిల్లా ఖర్కారా గ్రామం వద్ద ట్రాన్స్-హర్యానా ఎక్స్ప్రెస్వేపై ట్రక్కులు, బస్సులు, కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 25 మంది గాయపడ్డారు. మంగళవారం నాడు ఝజ్జర్ జిల్లాలోని రేవారి రోడ్డులో మరో ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications