అసహనంపై వక్రీకరణ, దిల్వాలే కలెక్షన్స్పై ప్రభావం: షారుక్
కోల్కతా: 'అసహనం'పై తాను ఎవరి మనసులు గాయపరిచే వ్యాఖ్యలు చేయలేదని, అందుకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ చెప్పాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పాడు. అతను కోల్కతాలో మాట్లాడారు.
నేను ఏం మాట్లాడానని క్షమాపణలు చెప్పాలన్నాడు. తాను వివరణ ఇచ్చే స్థాయిలో, పరిస్థితుల్లో లేనని చెప్పాడు. ప్రజలకు నేను బాగా తెలుసునని, కానీ తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని అభిప్రాయపడ్డాడు.
నా వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే'పై పడింది... కలెక్షన్లు తగ్గాయి: షారుఖ్
అసహనంపై తాను చేసిన వ్యాఖ్యల ప్రభావం తన తాజా చిత్రం దిల్వాలే పైన పడిందని షారుక్ ఖాన్ అన్నాడు. దీనిపట్ల తాను విచారం వ్యక్తం చేస్తున్నానన్నాడు. అయితే, అసహనంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని చెప్పాడు.
తన కళ్లతో ఏదైతే చూశానో అదే చెప్పానని, అయితే, తన మాటలను సరిగా అర్థం చేసుకోలేకపోయారన్నాడు. తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పాడు. గత 25 ఏళ్లుగా కులం, మతం, ప్రాంతం అనే తేడా లేకుండా తనను అభిమానిస్తున్నారని, తన సినిమాల ద్వారానే వారందరికీ తన ప్రేమను తిరిగి ఇవ్వగలనని చెప్పాడు. తన దేశభక్తిని శంకించాల్సిన అవసరం లేదన్నాడు.