శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే సామూహిక ఆత్మహత్య: శివసేన హెచ్చరిక
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను అనుమతిస్తే తాము సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామని శివసేనకు చెందిన కార్యకర్తలు హెచ్చరించారు. మహిళలను ఆలయంలోకి అనుమతించాలని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. సేవ్ శబరిమల అంటూ మహిళలు కూడా ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో శివసేన కేరళ విభాగం ఓ ప్రకటన చేసింది. ఎవరైనా తరుణ వయసు యువతులు ఆలయ ప్రవేశం అంటూ చేస్తే తాము మూకుమ్మడిగా ఆత్మాహుతికి పాల్పడతామంటూ ప్రకటించింది. అన్ని వయసుల మహిళలకు ఆలయప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామనీ, అందులోభాగమే ఈ ఆత్మాహుతి బృందాల ఏర్పాటనీ శివసేన కేరళ విభాగం సారధి పెరింగమ్మల అజి తెలిపారు.

ఇందులో మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. తమ మహిళా కార్యకర్తలు అందరు కూడా ఈ నెల 17, 18 తేదీల్లో పంబానది సమీపంలో విడిది చేస్తారని తెలిపారు. ఏడుగురు సభ్యుల ఆత్మాహుతి బృందం అక్కడే సిద్ధంగా ఉంటుందన్నారు.
కాగా, శబరిమలలో అయ్యప్ప ఆలయాన్ని మాస పూజాదికాల కోసం ఈ నెల 17వ తేదీన సాయంత్రం తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోకి యువతులు ప్రవేశిస్తే తీవ్ర చర్యలకు పాల్పడుతామని హెచ్చరికలు పెరుగుతున్నాయి. ఓ మత సంబంధ అంశాల్లో జోక్యం చేసుకోవడాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇతర మతాల్లోని వారిని కూడా అలాగే అనుమతిస్తారా, ఇతర మతాల్లోని అంశాల్లోకి వెళ్తారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications