కోర్టుకు రండి: సౌమ్య ‘హత్యాచారం’ కేసులో కట్జూకు సుప్రీం సమన్లు
ఢిల్లీ: తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూకు సుప్రీంకోర్టు నుంచి పిలుపువచ్చింది. జస్టిస్ మార్కండేయ కట్జూ నవంబరు 11న తమ ముందు హాజరు కావాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సూచించింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. దేశ చరిత్రలో తొలిసారి ఓ మాజీ న్యాయమూర్తికి సుప్రీం నుంచి సమన్లు జారీ అవడం గమనార్హం.
కాగా, చట్టం ముందు ఎవరైనా ఒకటేనని చెప్పడానికి ఇదే ప్రబల నిదర్శనమని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. కేరళలో సంచలనం సృష్టించిన సౌమ్య అత్యాచారం, హత్య కేసు తీర్పులో 'ప్రాథమిక దోషాలు' ఉన్నాయని జస్టిస్ కట్జూ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది. '...ఆయనొక గౌరవప్రదమైన వ్యక్తి. తీర్పును విమర్శిస్తూ ఫేస్బుక్లో చేసిన వ్యాఖ్యపై వాదోపవాదనల నిమిత్తం వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా ఆయన్ని కోరుతున్నాం. మా తీర్పులో ఉన్న ప్రాథమిక దోషాలేమిటో చర్చించడానికి ఆయన న్యాయస్థానానికి రావాలి' అని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ యు యు లలిత్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఏ విషయంలోనైనా ఒక మాజీ న్యాయమూర్తిని సుప్రీంకోర్టు పిలిపించడం బహుశా ఇదే తొలిసారి అవుతుందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. సౌమ్య కేసులో ఆమె తల్లి, కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పునఃసమీక్ష పిటిషన్లపై ధర్మాసనం స్పందిస్తూ... జస్టిస్ కట్జూతో చర్చ ముగిసేవరకు వీటిని విచారణకు చేపట్టడం సబబు కాదని పేర్కొంది. న్యాయస్థాన పనివేళలు ముగిసినా ధర్మాసనం తన పనిని కొనసాగించింది.
అసలు జస్టిస్ కట్జూ ఏమన్నారు?
కేరళకు చెందిన సౌమ్య అనే యువతిపై 2011 ఫిబ్రవరి 1న అత్యాచారం జరిగింది. రైలులో వెళుతున్న ఆమెను గోవిందస్వామి అనే వ్యక్తి బయటికి లాక్కెళ్లి, పట్టాలపై అత్యాచారం చేసి, చంపినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు గోవిందస్వామిని 'హత్యాచారం' కేసులో దోషిగా నిర్ధారిస్తూ మరణ శిక్ష విధించింది. 2013 డిసెంబర్ 17న ఈ తీర్పు చెప్పింది.
దీనిపై గోవిందస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడిని సుప్రీంకోర్టు అత్యాచారం కేసులో మాత్రమే గోవిందస్వామిని దోషిగా నిర్ధారించింది. సౌమ్య మరణానికి అతడు కారణం లేదని చెప్పింది. అయితే... రైలు బోగీలోనే సౌమ్యపై గోవిందస్వామి దాడి చేశాడని, విచక్షణారహితంగా కొట్టాడని పోలీసులు, సౌమ్య తల్లి తరఫు న్యాయవాదులు వాదించారు.
కానీ, 'సౌమ్య తనంతట తాను రైలు నుంచి దూకింది. ఆ గాయాలవల్లే మరణించింది' అనే వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. గోవిందస్వామికి విధించిన మరణ శిక్షను యావజ్జీవానికి తగ్గిస్తూ సెప్టెంబర్ 25న తీర్పు చెప్పింది. తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే జస్టిస్ కట్జూ దీనిపై స్పందించారు
2011 ఫిబ్రవరి 1న రైలు పెట్టెలో ఒంటరిగా ఉన్న సౌమ్యను కిరాతకంగా హతమార్చి, పట్టాల మీదే ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు గోవిందస్వామిపై హత్యానేరాన్ని మోపకపోవడం ద్వారా సుప్రీంకోర్టు ఘోర తప్పిదం చేసిందని జస్టిస్ కట్జూ ఫేస్బుక్ ద్వారా వ్యాఖ్యానించారు.
'న్యాయస్థానం సెక్షన్-300ని జాగ్రత్తగా చదవకపోవడం విచారకరం. దశాబ్దాలుగా న్యాయ ప్రపంచంలో ఉన్న న్యాయమూర్తుల నుంచి ఇలాంటి తీర్పు ఆశించలేం. బహిరంగ విచారణ ద్వారా తీర్పును పునఃసమీక్షించాలి' అన్నారు. మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు. హతురాలిని నిందితుడే రైల్లోంచి తోసివేస్తే న్యాయస్థానం మాత్రం చెప్పుడు సాక్ష్యాన్ని విని ఆమే రైల్లోంచి దూకినట్లు విశ్వసించిందని విమర్శించారు.
కాగా, ఈ వ్యాఖ్యలన్నింటినీ న్యాయస్థానం ఉటంకించింది. సౌమ్యపై నిందితుడు దాడి చేసి, అత్యాచారం చేసినట్లు తాము విశ్వసించే యావజ్జీవ శిక్ష విధించామనీ, ఆమెను అతను హత్య చేసినట్లు మాత్రం నమ్మడం లేదని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. కాగా, జస్టిస్ కట్జూను న్యాయస్థానంలో హాజరుకావాల్సిందిగా ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం ఆహ్వానించింది.