యూపీ ఎన్నికల సిత్రం: చెప్పుతో వాయించుకున్న ఎస్పీ నేత..
ఎన్నికల ప్రచారంలో.. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన కాలికున్న షూ తీశారు. ఆ వెంటనే ఎడాపెడా తన రెండు చెంపలను తానే వాయించుకున్నారు.
లక్నో: ప్రజల కాళ్లా వేళ్లా పడి ఓటేయాల్సిందిగా వారిని వేడుకునే నాయకులను ఎన్నికల ప్రచారంలో చాలామందినే చూసే ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కొత్త సిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఎస్పీకి చెందిన ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఏకంగా తన చెప్పుతో తానే ఎడాపెడా వాయించుకుని అక్కడున్న స్థానికులను నోరెళ్లబెట్టేలా చేశాడు.
ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయానన్న బాధో.. కనీసం ఈసారైనా గెలిచి పరువు నిలుపుకోవాలన్న తాపత్రయమో గానీ.. ఎస్పీకి చెందిన షుజాత్ ఆలం అనే ఎమ్మెల్యే అభ్యర్థి తన చెప్పుతో తానే వాయించుకున్నాడు.
రెండు రోజుల క్రితం బులందర్ షహర్ లో షుజాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గతంలో తెలియక జరిగిన తప్పులేమైనా ఉంటే క్షమించండి అని షుజాత్ ప్రజలను వేడుకున్నారు. ఇలా మాట్లాడుతూనే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన కాలికున్న షూ తీశారు. ఆ వెంటనే ఎడాపెడా తన రెండు చెంపలను తానే వాయించుకున్నారు.

అంతేకాదు, తన కుర్తాను 'జోలె' గా పట్టి ఓట్లేయాల్సిందిగా అడుక్కున్నాడు. దీనిపై వివరణ అడగ్గా ..'ఏం చేస్తాం సాబ్.. ఈరోజుల్లో జనాలు జోకర్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ఇలాంటి ఫీట్లు కూడా చేయాల్సిందే' అంటూ చెప్పుకొచ్చారు.
గతంలో చేసిన తప్పులను మరిచిపోయి.. తనకు ఓటేయాల్సిందిగా అక్కడి ప్రజలను కోరారు. బీఎస్పీ అభ్యర్థి హజీ అలీంపై గెలుపు కోసం షుజాత్ నానాపాట్లు పడుతున్నారు. కాగా, ఎమ్మెల్యే చెప్పులతో కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.












Click it and Unblock the Notifications