రైల్వేస్టేషన్లో భారీగా తొక్కిసలాట: కాళ్ల కింద నలిగిన జనం
అహ్మదాబాద్: దీపావళి పండగ వేళ.. గుజరాత్లోని సూరత్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. సూరత్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట (Stampede in Surat Railway Station) సంభవించింది. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటన సంభవించిన వెంటనే రైల్వే భద్రత సిబ్బంది, రైల్వే జనరల్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. యుద్ధ ప్రాతిపదికన స్పందించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. సూరత్కే చెందిన రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోష్ (Darshana Jardosh) ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

దీపావళి పండగకు సొంత ఊరికి వెళ్లడానికి ప్రజలు భారీ సంఖ్యలో రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. రైల్వే స్టేషన్లో కనీస వసతులు అందుబాటులో ఉండకపోవడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుందని తెలుస్తోంది. రైలు ఎక్కే సమయంలో ఒకరినొకరు తోసుకోవడం.. తొక్కిసలాటకు దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మృతుడిని బిహార్లోని ఛాప్రా జిల్లాకు చెందిన వీరేంద్ర కుమార్గా గుర్తించారు. ఛత్ పూజ కోసం సొంత గ్రామానికి వెళ్లడానికి సూరత్ రైల్వేస్టేషన్కు వచ్చి ప్రాణాలను కోల్పోయారు. ఊపిరి ఆడక సంఘటన స్థలంలో కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై పశ్చిమ రైల్వే అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. దీపావళి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముంబైకి పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్నామని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సుమిత్ థాకూర్ తెలిపారు.
ముంబై సహా మధ్యప్రదేశ్లోని వివిధ నగరాల మధ్య 400 ట్రిప్పులు రాకపోకలు సాగించేలా 46 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. స్టేషన్లో 165 మంది ఆర్పీఎఫ్, జీపీఎఫ్ జవాన్లను మోహరింపజేశామని సుమిత్ థాకూర్ తెలిపారు. టికెట్ల కోసం అదనపు కౌంటర్లను నెలకొల్పామని చెప్పారు.












Click it and Unblock the Notifications