చిన్నమ్మ చాప్టర్ క్లోజ్: సాగనంపేందుకు ముహూర్తం ఫిక్స్?, ఆస్తులు కూడా!
వచ్చే నెల 15వ తేదీన కొత్త కార్యదర్శిని ఎన్నుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చెన్నై: అయిపోయింది.. అంతా అయిపోయింది.. చిన్నమ్మ రాజకీయ జీవితానికి ఇక పూర్తిగా తెరపడిపోయినట్లే. జైల్లో ఉన్నా సరే.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా అంతా కనుసన్నుల్లో జరగాలన్న ఆమె శపథం ఇక నెరవేరనట్లే. దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ గా నియమించి కోరి మరీ కష్టాలను కొనితెచ్చుకుంది శశికళ.
అనుయాయిగా ఉంటాడనుకున్న పళనిస్వామి.. ప్రత్యర్థి పన్నీర్ సెల్వంతో చేయి కలపడంతో అన్నాడీఎంకెలో ఇక శశికళ రాజకీయాలకు తావు లేకుండా పోయింది. అధికారికంగా అన్నాడీఎంకెతో ఆమె సంబంధాలకు చరమగీతం పాడటానికి వచ్చే నెల 15వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది.
సంతకాల సేకరణ:
15వ తేదీన నిర్వహించే సమావేశంలో పార్టీకి కొత్త కార్యదర్శిని ఎన్నుకుంటుండటంతో శశికళను ఇక పూర్తిగా పక్కకు తప్పించినట్లే. అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబరు 15న ఈ సమావేశం నిర్వహిస్తుండటం గమనార్హం. పార్టీలోని 600 మంది సభ్యుల సంతకాల సేకరణ పూర్తికాగానే అధికారికంగా తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
ఆస్తులు కూడా పోయినట్లేనా?:
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ ఇప్పుడు ఆస్తులను కూడా కోల్పేయే పరిస్థితిలో ఉన్నారు. పరప్పన జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ, ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్ లను రూ.10కోట్ల జిరిమానా విధించాల్సిందిగా గతంలోనే కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. జరిమానా చెల్లించాల్సిన సమయం రావడంతో.. శశికళ గనుక అంత మొత్తం చెల్లించకపోతే.. ఆమె ఆస్తులను వేలం వేయడం ద్వారా ఆ డబ్బును జమ చేసుకోనున్నారు.
శిక్షా కాలం పొడగిస్తే:
ఒకవేళ అదీ జరగకపోతే.. ప్రస్తుతం నాలుగేళ్లు ఉన్న శిక్షా కాలాన్ని మరింత పొడగించే అవకాశం ఉంది. అదే జరిగితే శశికళకు గట్టి దెబ్బ తగిలినట్లే అని చెప్పాలి. అయితే శశికళ, ఇళవరసి, సుధాకరన్ ఆస్తులను జప్తు చేసేందుకే కర్ణాటక ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
సీఎం కావాలనుకుని:
అన్నీ అనుకూలిస్తే సీఎం కావాల్సిన చిన్నమ్మ.. ఆఖరికి పార్టీ రాజకీయాలకు కూడా కాకుండా పోయారు. ఈ పరిస్థితులకు కారణం స్వయంకృతపరాధమే అని చెప్పాలి. దినకరన్ ను పార్టీలో నియమించినప్పటి నుంచి పార్టీకి చేటు చేసేలా అతను వ్యవహరించాడు. ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఎన్నికల కమిషన్ అధికారికే లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
ఇదంతా పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేయడంతో.. దినకరన్ తో సహా చిన్నమ్మను కూడా సాగనంపడమే బెటర్ అని పళనిస్వామి నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే పన్నీర్ సెల్వంతో చర్చలు జరుపుతూ వీరిద్దరికి చెక్ పెట్టేశాడు.