జయ ఆరోగ్యం: స్పందించిన క్యాప్టెన్ విజయ్ కాంత్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య వివరాలు వెల్లడించాలని డీఎండీకే చీఫ్, క్యాప్టెన్ విజయ్ కాంత్ డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే నాయకులు రోజుకోక మాట చెప్పి ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు.
తన ఆధీనంలోని శాఖలను మంత్రి పన్నీర్ సెల్వంకు అప్పగించాలని జయలలిత ఎలా సూచించారో తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు స్పష్టం చేయాలని విజయ్ కాంత్ ఓ ప్రకటనలో మనవి చేశారు.
మంత్రి పన్నీర్ సెల్వంకు అన్ని బాధ్యతలు ఎలా అప్పగించారో చెప్పాలని పీఎంకే పార్టీ అధ్యక్షుడు డాక్టర్ రామదాస్ డిమాండ్ చేస్తున్నారు. అయితే రాజకీయాలు చెయ్యడానికి, పబ్లిసిటీ కోసం పలు పార్టీల నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నాడీఎంకే వర్గాలు మండిపడుతున్నాయి.
ఇంతకాలానికి విజయ్ కాంత్ కు అమ్మ మీద ఎందుకు అభిమానం పుట్టుకువచ్చిందని ప్రశ్నిస్తున్నారు. గతంలో డీఎండీకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను జయలిత గెలిపించారని గుర్తు చేశారు. తరువాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాను ఇచ్చిన జయలలితను జీవితాంతం విజయ్ కాంత్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.