కరుణ, బిజెపికి షాక్: సీఎం అభ్యర్థి హీరో విజయకాంత్
చెన్నై: తమిళనాడులో పొత్తు అంశంపై ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. విజయకాంత్తో పొత్తు కోసం డిఎంకె, బిజెపిలు పోటీ పడ్డాయి. అయితే, ఈ హీరో మాత్రం వారికి ఝలకిచ్చారు. ఇప్పుడు మరో ములుపు తిరిగాయి.
కరుణానిధి నేతృత్వంలోని డిఎంకెతో, నటుడు విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికె (విజయకాంత్ నేతృత్వంలోని పార్టీ) పొత్తు కుదుర్చుకోవచ్చన్న అంచనాలు తలకిందులయ్యాయి. ఎన్నికల్లో తమ కూటమిలో డిఎండికె చేరుతుందని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన కరుణానిధికి ఇప్పుడు కెప్టెన్ షాకిచ్చారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పీడబ్ల్యూఎఫ్( పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్) కూటమితో కలిసి పోటీ చేసేందుకు కెప్టెన్ మొగ్గు చూపారు. ఈ మేరకు ఆ కూటమి నేతలతో బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఎన్నికల్లో సీట్ల పంపిణీపై కూడా నిర్ణయం తీసుకున్నారు. విజయ్కాంత్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గానూ డిఎండిక 124 స్థానాల్లో, 110 స్థానాల్లో పిడబ్ల్యూఎఫ్ అభ్యర్థులు పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరింది.
విజయ్కాంత్ను కలిసిన వారిలో ఎండీఎంకే అధినేత వైగో, వీసీకేకు చెందిన తిరుమావలన్, సీపీఎం, సీపీఐ నేతలు ఉన్నారు. ఎండిఎంకె అధినేత వైగో కాగా, వీసీకేను చెన్నై న్యాయవాది తిరుమలవన్ నడుపుతున్నారు. కాగా, 124 స్థానాల్లో విజయకాంత్ పార్టీ పోటీ చేయనుండగా, మిగతా సీట్లను పొత్తులోని ఇతర పార్టీలకు పంచునున్నారు.
మాకు ఎలాంటి నష్టం లేదు: స్టాలిన్
డిఎండికె, పిడబ్ల్యూఎఫ్ పొత్తుతో తమకు ఎలాంటి నష్టం లేదని డిఎంకె సీనియర్ నేత ఎంకె స్టాలిన్ అన్నారు. వారితో విజయకాంత్ కలవడం తమను కలవరపరచలేదన్నారు. కాగా, కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏఱ్పడుతుందన్న విశ్వాసాన్ని పిడబ్ల్యూఎఫ్లోని ఎండిఎంకె నేత వైగో వ్యక్తం చేశారు.