షాకింగ్ : జులై 15 నాటికి చెన్నై పరిస్థితి ఎలా ఉండబోతుందంటే.. ఇదీ ఎంజీఆర్ వర్సిటీ అంచనా..
దేశంలో ముంబై,తమిళనాడు కరోనా పాజిటివ్ కేసుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ తమిళనాడులో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేసుల తీవ్రత ఇలాగే కొనసాగితే.. జులై రెండో వారం నాటికి చెన్నైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.5లక్షలకు చేరుకుంటుందని,1600 మరణాలు సంభవిస్తాయని ఎంజీఆర్ యూనివర్సిటీకి చెందిన అంటువ్యాధుల నిపుణులు అంచనా వేశారు. ఎంజీఆర్ వర్సిటీ వెల్లడించిన ఈ విషయాలతో తమిళనాడులో ఆందోళన మరింత పెరిగింది.

ఎంజీఆర్ వర్సిటీ నిపుణులు ఏమంటున్నారు..
ఎంజీఆర్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్,ఎపిడెమాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ డా.జి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'మా అంచనా ప్రకారం జులై 15 నాటికి చెన్నైలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.5లక్షలకు చేరుతుంది. అక్టోబర్ నెల మధ్య నాటికి ఇది పీక్స్కి చేరుకుంటుంది. మేము ఏప్రిల్ 18 నుంచి కరోనా కేసులను అంచనా వేయడం మొదలుపెట్టాం. మే మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక అందించాం. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం వైరస్ నియంత్రణకు అన్ని విధాలా కృషి చేస్తోంది.' అని తెలిపారు.

జూన్ 30 నాటికి 1.3లక్షల కేసులు
ఎపిడెమాలజిస్ట్ శ్రీనివాస్ టీమ్ అంచనా ప్రకారం జూన్ 30 నాటికి తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1.3లక్షలకు చేరుతుంది. 769 మరణాలు సంభవిస్తాయి. అంతకుముందు,మే నెల ప్రారంభమైన 10 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3097 నుంచి 5442కి చేరుతుందని వర్సిటీ ఏప్రిల్ రెండో వారంలో అంచనా వేసింది. వాస్తవానికి ఆ సంఖ్య మే 1 నుంచి మే 10వ తేదీ నాటికి 2526 నుంచి 7204కి పెరిగింది. అలాగే మే 10 నాటికి 38 మరణాలు సంభవిస్తాయని అంచనా వేయగా 47 మరణాలు సంభవించాయి.

చెన్నైపై అంచనాలు నిజమయ్యాయి..
చెన్నైకి సంబంధించి ఎంజీఆర్ వర్సిటీ అంచనాలు నిజమయ్యాయి. మే 25 నాటికి 83 మరణాలు సంభవిస్తాయని చెప్పగా.. అదే నిజమైంది. అలాగే 11,119 కరోనా కేసులు నమోదవుతాయని అంచనా వేయగా.. వాస్తవంగా కేవలం 12 కేసులు తక్కువ నమోదయ్యాయి. జూన్ 3న వరకు 17,738 కేసులు, 156 మరణాలు సంభవిస్తాయని అంచనా వేయగా.. వాస్తవంగా 17,598 కేసులు,153 మరణాలు నమోదయ్యాయి. చెన్నైలో ఇప్పటివరకూ 9034 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ జే రాధాకృష్ణన్ తెలిపారు.

తాజా పరిస్థితి ఇలా..
గత 14 రోజుల్లో చెన్నైలోని 1000 కంటైన్మెంట్ జోన్లలో ఎక్కడా సింగిల్ కేసు నమోదు కాలేదన్నారు. అత్యధిక కేసులు చెన్నైలోనే ఉన్నంత మాత్రానా.. నగరం మొత్తం కరోనాకు ఎఫెక్ట్ అయిందనుకోవద్దన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని.. రోయపురం,అన్నా నగర్,తేనాంపేట్,కొడంబాక్కం లాంటి మురికివాడలు,వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని రాధాకృష్ణన్ తెలిపారు.












Click it and Unblock the Notifications