చెత్త వేస్తే 'ఛాయ్' వచ్చే డామ్ డామ్..! (వీడియో)
Recommended Video
ప్రయాగ్ రాజ్ : కుంభ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో భారీగా భక్తులు తరలిరావడంతో అపరిశుభ్రత అదే స్థాయిలో పేరుకుపోతోంది. దీంతో అక్కడి అధికారులు ఓ చిట్కా కనిపెట్టారు. చలి పంజాతో గజగజ వణుకుతున్న సందర్శకులకు ఛాయ్ ఆఫర్ ప్రకటించారు. చెత్త వేస్తే చాలు.. గరం గరం ఛాయ్ ఇచ్చే మెషిన్ అందుబాటులో ఉంచారు.
భాయ్.. ఎనీ టైమ్ ఛాయ్..!
కుంభ మేళాకు తరలివస్తున్న భక్తులను ఏటీఎం లాంటి ఛాయ్ మెషిన్ ఆకట్టుకుంటోంది. చలి తీవ్రత కారణంగా ఛాయ్ తాగితే బాగుండు అనుకునేవారు ఈ యంత్రం చూసి హమ్మయ్య అనుకుంటున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కుంభ మేళాలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన ఛాయ్ ఏటీఎం పలువుర్ని ఆకర్షిస్తోంది. చెత్త వేస్తే చాలు. గరం గరం ఛాయ్ అందిస్తోంది ఈ యంత్రం.
పరిశుభ్రతకు పెద్దపీట
కోట్లాదిమంది భక్తులు తరలివచ్చే కుంభ మేళాలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఛాయ్ యంత్రం ప్రవేశపెట్టారు. చెత్త గానీ వాటర్ బాటిళ్లు గానీ ఈ మెషిన్ లో వేస్తే.. గరం గరం ఛాయ్ ఇస్తుంది. కుంభమేళాలో క్లీన్ తో పాటు పర్యావరణం కాపాడే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ యంత్రాన్ని భక్తులు బాగానే వాడుతున్నారట. సాధారణంగా జాతర లాంటి ప్రదేశాల్లో ఆహార పదార్థాల కవర్లు, వాటర్ బాటిళ్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. అయితే అలాంటి పరిస్థితి కుంభ మేళాలో కనిపించొద్దనే ఉద్దేశంతో ఈ ఛాయ్ మెషిన్లు తెరపైకి తెచ్చారు.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా..!
ఇలాంటి యంత్రం వాడటం కుంభ మేళా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. కుంభ మేళా ముగిశాక అక్కడ పోగయ్యే చెత్త అంతా ఇంతా కాదు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు దాదాపు 20వేల చెత్తబుట్టలు అందుబాటులో ఉంచారు. అయినా కూడా చెత్త ఎక్కడంటే అక్కడే పడవేస్తారు చాలామంది. ఆ క్రమంలో చెత్త వేస్తే ఛాయ్ వచ్చే మెషిన్ తీసుకొచ్చారు. దీంతో కొంతలో కొంత బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడకుండా నివారించినట్లు అవుతుందనేది నిర్వాహకుల ఆశ. ఇన్ఫ్రారెడ్ సెన్సర్ ద్వారా ఈ యంత్రం పనిచేస్తుంది. ఎవరైనా చెత్త వేయగానే ఆటోమాటిక్ గా టీ ఇస్తుంది.
చెత్తకు ఛాయ్ ప్రచారం బాగానే వర్కవుట్ అవుతోందంటున్నారు నిర్వాహకులు. రోజుకు 1500 వరకు టీ కప్పులు వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు. జనవరి 15న ప్రయాగ్ రాజ్ లో మొదలైన అర్థ కుంభ మేళా మార్చి 4 వరకు కొనసాగనుంది. దాదాపు 10 నుంచి 15 కోట్ల మంది వరకు కుంభ మేళాకు హాజరవుతారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.