బెంగళూరులో మిత్రుడి భార్యను చంపిన టెక్కీ అరెస్టు
బెంగళూరు: మిత్రుడి భార్యను చంపిన ఓ యువ టెక్కీని పోలీసులు సోమవారంనాడు కర్ణాటక రాజధాని బెంగళూరులో అరెస్టు చేశారు. 32 ఏళ్ల అనుమానితుడు బసుదేవ జెనా తన మిత్రుడు దేవశీష్ భార్య వద్ద 25 వేల రూపాయలు అప్పు తీసుకోవడానికి అతని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మిత్రుడు దేవశీష్ భార్య ప్రాచీ ఒంటరిగా ఉంది.
అతనికి ఇవ్వడానికి ఆమె అంత డబ్బు లేదు. దాంతో బసుదేవ జెనా ఆమె బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించాడు. దాంతో భయాందోళనలకు గురైన ప్రాచీ పెద్దగా కేకలు వేసింది. ఆమె గొంతును మూయించడానికి అతను వంటగదిలోని కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు.
ఇంటి యజమాని సరస్వతి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఆమె కేకలు విన్న సరస్వతి పరుగున రెండో అంతస్థుకి చేరుకుంది. ఏం జరుగుతుందోనని చూడడానికి వెళ్లిన సరస్వతి పైకి వెళ్తున్న సమయంలో నిందితుడు కిందికి పరుగెత్తాడు. అతని చేతులపై, చొక్కాపై రక్తం మరకలు ఉన్నాయి.
అతను కిందికి వెళ్లి పారిపోవడానికి ప్రయత్నిస్తుండడంతో ఇంటి యజమాని పెద్దగా అరిచింది. దాంతో ఆ దారిన పోతున్న వాళ్లు అతన్ని పట్టుకున్నారు. అతన్ని గస్తీ తిరుగుతున్న పోలీసులకు అప్పగించారు. జెనాపై పోలీసులు హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. జెనా ఒడిషాలోని భువనేశ్వర్కు చెందినవాడు. 35 ఏళ్ల దేవశీష్కు జెనా చాలా కాలంగా మిత్రుడు. ప్రాచీకి దాదాపు 30 ఏళ్ల వయస్సు ఉంటుంది.
అల్లరి చేయకుండా ఉండడానికి తాను ప్రాచీ గొంతు కోసినట్లు జెనా పోలీసుల వద్ద అంగీకరించాడు. జెనా సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. బెంగళూరులోని విప్రోలో దేవశీష్ సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవలే జెనా దేవశీష్ నుంచి 25 వేల రూపాయలు తీసుకున్నాడు.
ఏడాది క్రితం వరకు ఇద్దరు కూడా ఒకే ఫ్లాట్లో నివసిస్తూ వచ్చారు. 8-10 నెలల క్రితం దేవశీష్ ప్రాచీని పెళ్లి చేసుకున్న తర్వాత జెనా వేరే ఫ్లాట్లోకి మారాడు. జెనా అమెరికాలో ఏడేళ్ల పాటు ఐటి ప్రాజెక్టులు చేసినట్లు సమాచారం. కోటి రూపాయల దాకా అతని అప్పులు పేరుకుపోయినట్లు చెబుతున్నారు.