ఎమ్మెల్యేలకు ఎర కేసుపై బీఎఎల్ స్పందన ఇదే, వారికి వార్నింగ్: బీజేపీ నేతలకు దిశానిర్దేశం
హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఆ పార్టీలో కీలక నేతలు ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. తాజాగా, గురువారం శామీర్ పేటలోని ఓ రిసార్ట్లో జరుగుతున్న బీజేపీ సమావేశానికి పార్టీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ బీఎల్ సంతోష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ ఛుగ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ వైఫల్యాలపై ఫోకస్ పెట్టాలన్న బీఎల్ సంతోష్
తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు, ఇంఛార్జీలు, విస్తారక్ లు, పాలక్ లతో సమావేశమైన బీఎల్ సంతోష్.. వారికి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలు చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబపాలన గురించి ప్రజలకు వివరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

119 నియోజకవర్గాలకు పాలక్లుగా బీజేపీ నేతలు
119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్లుగా ముఖ్య నేతలను నియమించింది. వీరంతా నెలలో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు. నియోజకవర్గాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్ లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. శేరిలింగంపల్లి పాలక్గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మేడ్చల్ పాలక్గా ఎంపీ లక్ష్మణ్, కుత్బుల్లాపూర్కు డీకే అరుణ పాలక్గా నియమితులయ్యారు. జుక్కల్ నియోజకవర్గానికి వివేక్ వెంకటస్వామిని పాలక్గా నియమించారు. ఎల్లారెడ్డికి రఘునందన్, రామగండం, మహబూబ్నగర్ల పాలక్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పఠాన్ చెరుకు మురళీధర్ రావు, చేవెళ్లకు జితేందర్ రెడ్డి, పరిగికి విజయశాంతి, ఇబ్రహీంపట్నంకు ప్రకాశ్ రెడ్డి, సిరిసిల్లకు రాణీరుద్రమ, మెదక్కు ధర్మపురి అర్వింద్, ఇతర ముఖ్య నేతలకు పాలక్లుగా బాధ్యతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించింది.

ఫాంహౌస్ కేసుపై బీఎల్ సంతోష్ వార్నింగ్
కాగా, మొయినాబాద్ ఫాంహౌస్ కేసుకు సంబంధించి బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్పందించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు చేసినవారే సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, నాయకులు ప్రజాస్వామ్యానికి శాపంగా మారారని మండిపడ్డారు. హైదరాబాద్ సంపదను రాజకీయాల కోసం దేశమంతా పంచుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ నేతలు ద్రోహం చేశారన్నారు. ప్రజలకు తాను తెలియకపోయినా తన పేరు ప్రతి ఇంటికీ తీసుకెళ్లారన్నారు.












Click it and Unblock the Notifications