రాజ్యసభలో బీజేపీ పక్ష నేతగా థావర్చంద్ గెహ్లట్ .. ఎందుకంటే ..?
న్యూఢిల్లీ : రాజ్యసభలో బీజేపీ పక్ష నేతగా థావర్చంద్ గెహ్లట్ను ఆ పార్టీ నియమించనుంది. ఇదివరకు లీడర్ ఆఫ్ హౌస్గా సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యవహరించేవారు. అయితే అనారోగ్య కారణాల వల్ల తాను కీలక పదవులను చేపట్టబోనని జైట్లీ .. బీజేపీ హైకమాండ్కు స్పష్టంచేశారు. దీంతో సభలో జైట్లీ వారసుని కోసం అన్వేషించి .. చివరకు గెహ్లట్ వైపు కమలదళం మొగ్గుచూపింది.
కీలక నేతకు పట్టం ...
గెహ్లట్ మోడీ తొలి క్యాబినెట్లో సామాజిక న్యాయం, ఉపాధి కల్పన శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. తన శాఖలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంలో కీ రోల్ షోపించారు గెహ్లట్. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు, వికలాంగుల సంక్షేమం కోసం మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆద్యుడు గెహ్లటే. షాజపూర్ లోక్సభ నుంచి 1996 నుంచి 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. అయితే నియోజకర్గాల పునర్విభజనతో షాజపూర్ కాస్త దివాస్గా మారింది. 2009 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయన 2012 నుంచి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2018లో పదవీకాలం ముగియగా .. మరోసారి పెద్దల సభ నుంచి బీజేపీ అవకాశం కల్పించింది.

అంచెలంచెలుగా ఎదిగారు ....
థావర్చంద్ గెహ్లట్ దళితనేత. బీజేపీలో మంచి పేరున్న లీడర్. ఉజ్జయిని జిల్లా రుపేటా గ్రామంలో 1948 మే 18న జన్మించారు. ఉజ్జయినిలోని విక్రమ్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి .. అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీలో దళితనేత థావర్చంద్ గెహ్లట్ రాజ్యసభలో బీజేపీ పక్ష నేత అయితే బాగుంటుందని ఆ పార్టీ భావించంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా గెహ్లట్ వైపు మొగ్గుచూపారు. గెహ్లట్ ఇదివరకు గుజరాత్ కేంద్ర పరిశీలకుడిగా కూడా పనిచేశారు. ఢిల్లీ, కర్ణాటక బీజేపీ ఇంచార్జీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. బీజేపీ ఎస్సీ సెల్ చైర్మన్ పదవీ కూడా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యునిగా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు కీలకమైన రాజ్యసభలో బీజేపీ పక్ష నేతగా ఎంపికవబోతున్నారు.












Click it and Unblock the Notifications