లోకాయుక్త భాస్కర్ రావ్ నెల సెలవు
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ మళ్లీ సెలవు మీద వెళ్లారు. ఆయన సెప్టెంబర్ 30వ తేది వరకు తన సెలవును పొడగించారు. అయితే ఆయన తన భాద్యతలు ఉప లోకాయుక్తకు అప్పగించలేదని తెలిసింది.
లోకాయుక్తలో రూ. కోటి లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో ప్రత్యేక బృందం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇదే కేసులో లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ కుమారుడు అశ్విన్ రావ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
అశ్విన్ రావ్ అరెస్టు అయిన తరువాత లోకాయుక్త న్యాయమూర్తి భాస్కర్ రావ్ జులై 17 నుండి ఆగస్టు 17 వరకు సెలవు పెట్టారు. తరువాత ఆగస్టు 31వ తేది వరకు సెలవు పెట్టారు. ఇప్పుడు సెప్టెంబర్ 30వ తేది వరకు సెలవును పొడగించారు.
అయితే భాస్కర్ రావ్ సుదీర్ఘంగా సెలవు మీద వెళ్లడంతో లోకాయుక్తలో పనులకు బ్రేక్ పడింది. ఈ విషయంపై లోకాయుక్త మాజీ న్యాయమూర్తి సంతోష్ హెగ్డే స్పందించారు. ఆయన సెలవు మీద వెళ్లిన తరువాత ఆ పనులు ఉప లోకాయుక్తకు అప్పగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.