కరోనా లాక్ డౌన్ ఎలా ఫెయిలైందంటే.. సాక్ష్యం చూపిన రాహుల్.. తప్పంతా నెహ్రూదేనన్న బీజేపీ..
భారత్ లో కరోనా వైరస్ భయానకంగా వ్యాప్తి చెందుతున్నది. కొత్త కేసులు, మరణాల్లో రోజుకో రికార్డు నమోదవుతున్నది. శుక్రవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 9851 కొత్త కేసులు, 273 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.3లక్షలకు, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6500కు పెరిగింది. సరిగ్గా వైరస్ వ్యాప్తి పీక్ దశకు చేరుతున్న సమయంలోనే లాక్ డౌన్ దాదాపుగా ఎత్తేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపడుతున్నది.

రాహుల్ ట్వీట్ వైరల్..
లాక్ డౌన్ స్ట్రాటజీని సమర్థవంతంగా అమలు చేయడంలో మోదీ సర్కార్ దారుణంగా ఫెయిలైందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలు చేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ నుంచి దేశం ఎలా కోలుకోవాలనేదానిపై పలు రంగాల ప్రముఖులు, నిపుణులతో చర్చలు జరుపుతోన్న ఆయన.. లాక్ డౌన్ వైఫల్యానికి సంబంధించి శుక్రవారం చేసిన ట్వీట్ వైరలైంది.

ఇదిగో సాక్ష్యం..
ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు కూడా సంపూర్ణ లాక్ డౌన్ విధించిన దాఖలాలు లేవని, అలాంటిది కరోనా వ్యాప్తిని కట్టడి చేసే పేరుతో దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన కేంద్ర సర్కారు.. ఆ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో విఫలం చెందిందని రాహుల్ గాంధీ అన్నారు. మిగతా దేశాలు లాక్ డౌన్ ను ఒక పనిముట్టులా వాడుకుని, ఆ గడువులోపలే ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేశాయని, మూడు‘టీ'ల (టెస్ట్, ట్రేస్, ట్రీట్) విధానాన్ని పక్కాగా అమలుచేశాయన్న ఆయన.. స్పెయిన్, జర్మనీ, ఇటలీ, యూకే, ఇండియాల్లో లాక్ డౌన్ కు ముందు, ఆ తర్వాత కరోనా కర్వ్ కు సంబంధించిన గ్రాఫ్ లను షేర్ చేశారు. ‘‘దీన్ని బట్టి ఫెల్యూర్ లాక్ డౌన్ ఎలా ఉంటుందో తెలుస్తోంద'ని ఆయన వ్యాఖ్యానించారు.

ఇండియాను ఇటలీగా మార్చుతారు..
కరోనా లాక్ డౌన్ అమలులో బీజేపీ సర్కారు ఫెయిలైందన్న రాహుల్ విమర్శలకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘రాహుల్, ఆయన సోదరి ప్రియాంక చెబుతున్నట్లు భారత్ లో లాక్ డౌన్ ఫెయిల్ కాలేదు. ప్రధాని మోదీ సత్వర నిర్ణయాల వల్లే ఇవాళ మనం సేఫ్ గా ఉన్నాం. ప్రజలుగానీ ఈ కాంగ్రెసోళ్ల మాటల్ని గుడ్డిగా నమ్మేస్తే ఇండియాను ఇటలీగా మార్చేస్తారు. బాబూ.. దేశాన్ని ఇలాగే ఉండనివ్వండి..''అని సీఎం యోగి అన్నారు.
Recommended Video

తప్పంతా నెహ్రూదే..
ఓవైపు కరోనా లాక్ డౌన్ లో ఫెయిలైన మోదీ సర్కారు.. మరోవైపు సరిహద్దు గొడవలో చైనాను కూడా సరిగా డీల్ చేయలేకపోతున్నదని రాహుల్ దుయ్యబట్టారు. దీనిపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ.. ‘‘రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే ఇండియాకు చైనాతో వివాదాలు తలెత్తాయి. ఆ వాస్తవాన్ని కన్వీనియంట్ గా మర్చిపోయి కాంగ్రెస్ నేతలు ఇవాళ విమర్శలకు చేస్తుండటం సిగ్గుచేటు. చైనా మొట్టమొదటి ప్రధాని చౌఎలైతో కలిసి నెహ్రూ ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. ‘హిందీ చీనీ భాయీ భాయీ'' అని నినాదాలు కూడా చేశారు. నెహ్రూ చేసిన తప్పులకు దేశం ఇవాళ్టికి కూడా మూల్యం చెల్లిస్తోంది''అని జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications