ఇక్కడ బెదిరింపులు పనిచేయవు: రాజ్యసభలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో బెదిరింపుల వల్ల ప్రయోజనం ఉండదని, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెదిరింపులను ఎదుర్కొన్నానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మంగళవారం సాయంత్రం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నాం, అన్నీ మాకే తెలుసన్న భావనతో మాలో లేదన్నారు. అందరం కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దేశ పురోగతిలో అందరం చేయి చేయి కలపాలన్నారు.
ప్రజాభిప్రాయానికి అనుకూలంగా పార్లమెంట్ ఉండాలని కోరారు. దేశాభివృద్ధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేపట్టిన పథకాలనే మన్మోహన్ ప్రభుత్వం పేర్లు మార్చి కొనసాగించిందని అన్నారు.
స్వాతంత్య భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. దీంతో సభలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేశారు. దీంతో పలు పథకాల పేర్లు చదివి వినిపించారు. గిరిజనులు ఎక్కువ మంది బీజేపీని ఎన్నుకున్నారని ఆయన చెప్పారు. వీరితో పాటు సిక్కులు, ముస్లింలు కూడా బీజేపీకి మద్దతుగా నిలిచారన్నారు.
దేశ ప్రజల కోసమే జన్ ధన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టామని, పేదలు ధనవంతులు కావాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలల్లో మరుగుదొడ్లు కూడా లేవని అన్నారు.
దేశ ప్రజలంతా బాగుపడాలంటే డబ్బులు కావాలన్నారు. అలాంటి వ్యవస్ధ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. తాము జన్ ధన్ యోజనతో అలాంటి వ్వవస్ధనే తీసుకొచ్చామని చెప్పారు. 46 శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం కార్పోరేట్ వ్యవస్ధకు మద్దతు పలకడం లేదని, తమ సంస్కరణల ఫలితాలు నెమ్మదిగా కనబడతాయని ఆయన చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయిద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన చేసిన ప్రకటనలను తాను సమర్థించటం లేదన్నారు.
చెన్నైలో మూసివేసిన నోకియా ప్లాంట్ను తిరిగి తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భూ సేకరణ చట్టంలో బలహీనతలపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. గతంలో చట్టంలో పేర్కొన్న విధంగానే రైతులకు పరిహారం ఇస్తామని చెప్పారు.
ఆహారభద్రతా చట్టంపై ప్రతిపక్షాలు సందేహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 67 శాతం మంది ఆహారభద్రతా చట్టంకిందే ఉన్నారని ప్రధాని మోడీ గుర్తు చేశారు. కేంద్ర పన్నుల్లో 42 శాతం రాష్ట్రాలకు కేటాయించామని ప్రధాని మోడీ చెప్పారు. అదే విధంగా బొగ్గు వేలంతో వచ్చిన డబ్బును రాష్ర్టాలకు పంచుతామని మోడీ తెలిపారు.
బెంగాల్కు రూ. 22 వేల కోట్లు, ఏపీకి రూ. 15 వేల కోట్లు, ఒడిశాకు రూ. 8 వేల కోట్లు ఆర్ధిక సాయం అందుతుందని చెప్పారు. అభివృద్ధికి ఉగ్రవాదం తీవ్ర ఆటంకంగా పరిణమించిందని, ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు.