తృణమూల్ కార్యకర్త దారుణహత్య: ఎన్నికల హింస: అమిత్ షా వర్చువల్ ర్యాలీ నిర్వహించిన అయిదోరోజే
కోల్కత: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ఉద్రిక్తంగా మారుతోంది. ఎన్నికల హింస పతాక స్థాయికి చేరుకుంటోంది. దాడులు, ప్రతిదాడులు సర్వసాధారణమౌతున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ కార్యకర్తలు పరస్పరం భౌతికదాడులకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితుల్లో భౌతికదాడులకు ఈ రెండు పార్టీలు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ను ఓడించి తీరాలనే ఉద్దేశంతో బీజేపీ అనైతిక రాజకీయాలకు పాల్పడుతోందంటూ తృణమూల్ నేతలు విమర్శిస్తోన్నారు.

తృణమూల్ కార్యకర్తపై దాడి..
తాజాగా- ఝార్గ్రామ్లో ఎన్నికల హింస చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త ఒకరు మరణించారు. నటురా బస్స్టాండ్ సమీపంలో బైక్పై వెళ్తోన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తపై పలువురు బీజేపీ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన అతణ్ని పోలీసులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

ఆసుపత్రి వద్ద అదనపు బలగాలు..
ఈ సమాచారం అందుకున్న వెంటనే పలువురు తృణమూల్ కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆవరణలో బైఠాయించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా- తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే- జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఝార్గ్రామ్ జిల్లా ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. ఆసుపత్రితో పాటు నటురా బస్స్టాండ్ పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలు పహారా నిర్వహించారు. హత్యానంతరం ఎలాంటి ప్రతిదాడులు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

పోలింగ్ శాతాన్ని తగ్గించడానికే భయోత్పాతం..
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త హత్య పట్ల ఆ పార్టీ నేతల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించే బాధ్యత ఉన్న కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి దాడులను చేయిస్తోందంటూ తృణమూల్ అధికార ప్రతినిధి దేబాంగ్షు భట్టాచార్య ఆరోపించారు. తమ పార్టీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని, బీజేపీ ఓడిపోతుందంటూ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని, ఆ అక్కసుతోనే దాడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. భయోత్పాత వాతావరణాన్ని సృష్టించి, పోలింగ్ శాతాన్ని తగ్గించడానికి అప్రజాస్వామికంగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

15న అమిత్ షా పర్యటించాల్సి ఉండగా..
జిల్లా కేంద్రమైన ఝార్గ్రామ్లో ఈ నెల 15వ తేదీన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించాల్సి ఉంది. ఎన్నికల సభ, రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. హెలికాప్టర్లో సాంకేతిక కారణాలు తలెత్తడంతో ఆయన ఎన్నికల పర్యటన రద్దయింది. దీనితో వర్చువల్ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్లో గూండా రాజ్ నెలకొందంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎలాగైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మమతా బెనర్జీ ఎన్నికల హింసను ప్రోత్సహిస్తోన్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల హింసకు తృణమూల్ కాంగ్రెస్సే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications