జాగ్రత్త: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు ఇన్ష్యూరెన్స్ ప్రీమియంకు లింకేంటి..?
సెప్టెంబర్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాల్లో దీన్ని కచ్చితంగా అమలు చేస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర మోటార్ వెహికల్ చట్టాలనే అమలు చేస్తున్నాయి. తాజాగా వాహనదారులపై మరో ప్రయోగం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది కేంద్రం

వాహనం బీమా ప్రీమియంకు ముడిపెట్టనున్న ప్రభుత్వం
భారత్లో ప్రతి పదినిమిషాలకు 9 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా నిర్లక్ష్యపు డ్రైవింగ్తోనే జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి అడ్డుకట్టవేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కొత్త మంత్రాన్ని ఉపయోగించనుంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు విధించే జరిమానాలను వాహనం బీమా ప్రీమియంకు ముడిపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం సాధ్యసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా 9 సభ్యుల బృందంతో కూడిన కమిటీని నియమించింది కేంద్రం. ఈ కమిటీకి అనురాగ్ రస్తోగి నేతృత్వం వహిస్తున్నారు. ఇలా ముడి పెట్టడం వల్ల వాహనం నడిపే డ్రైవర్లు జాగ్రత్తగా నడుపుతారని తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతాయని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

బాధ్యతారాహిత్యంతో వాహనం నడిపితే ....
కొత్తగా వాహనం బీమా ప్రీమియంను ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు ముడిపెడితే ప్రజల్లో బాధ్యత పెరుగుతుందని పాలసీ బజార్ డాట్ కామ్ మోటార్ ఇన్ష్యూరెన్స్ హెడ్ సజ్జా ప్రవీణ్ చౌదరి చెబుతున్నారు. అంతేకాదు బాధ్యతతో నడిపే డ్రైవర్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే తక్కువ ప్రీమియంలు చెల్లిస్తారని అదే బాధ్యాతారాహిత్యంతో నడిపే డ్రైవర్లు ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారని చెప్పారు. ఇక ఎన్నిసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే అంత ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుందని రిలయన్స్ జనరల్ ఇన్ష్యూరెన్స్ ఈడీ మరియు సీఈఓ రాకేష్ చెబుతున్నారు.

అమెరికాలో బీమా ప్రీమియం ఇలా డిసైడ్ చేస్తారు
కేంద్రం నియమించిన ఈ కమిటీ ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘిస్తే ఇతర దేశాలు ఎలాంటి జరిమానాలు విధిస్తున్నాయో స్టడీ చేయనుంది. అవి భారత్లో ఏమేరకు అమలు చేసే వీలుంటుంది అనే దానిపై స్టడీ చేయనుంది. ఇప్పటి వరకు ఒక వాహనం బీమా చేయించాలంటే దాని తయారు చేసిన సంస్థ, మోడల్, వేరియంట్లపై ఆధారపడి ఉండేవి.ఆ మేరకు ఇన్ష్యూరెన్స్ రెగ్యులేటరీ మరియు డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా టేకప్ చేసేది.
అమెరికాలో చూస్తే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనను బట్టి దాని తీవ్రత మేరకు ఇన్ష్యూరెన్స్ ప్రీమియంను నిర్ణయిస్తారు. ఉదాహరణకు సీటుబెల్టు ధరించకపోతే దానిపై ప్రీమియం ఎక్కువగా ఉండదు. ఎందుకంటే బెల్టు ధరించనంత మాత్రానా కారుకు పెద్దగా నష్టం లేదని అన్నారు పాలసీబజార్ డాట్ కామ్ జనరల్ ఇన్ష్యూరెన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ తరుణ్ మాథుర్. కేవలం 60 డాలర్లు మాత్రమే ప్రీమియంపై విధిస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే మాత్రం ప్రీమియం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఇక పదే పదే మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడినట్లయితే ప్రీమియం ధర కూడా అంతే స్థాయిలో పెరుగుతూ పోతుందని తరుణ్ మాథుర్ తెలిపారు.
మొత్తానికి మీ వాహనం ఎంత సేఫ్గా ఉంటే అంత ప్రీమియం తగ్గుతుంది. ఒకవేళ మీరు కాకుండా మీ వాహనం తాళాలు మరొకరికి ఇస్తే వాహనం నడిపిన వ్యక్తి పాల్పడే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు మీరు బాధ్యులవుతారు. ఆ వ్యక్తి పాల్పడిన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు తీవ్రత ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి మీరు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు ఉంటాయి.












Click it and Unblock the Notifications