సంచలనమే: ఉచిత ఇంటర్నెట్ దిశగా ట్రాయ్ అడుగులు
న్యూఢిల్లీ: దేశమంతటా ఇంటర్నెట్ ఉచితంగా అందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. తాజాగా, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన పత్రాల్లో ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపింది.
ఇది కార్యరూపంలోకి వస్తే మరికొద్ది రోజుల్లోనే అందరికీ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కలిగే అవకాశం ఉంది. కాగా, గతంలో కొన్ని వెబ్ సైట్లను మాత్రమే ఉచితంగా అందించే విధంగా(ఫ్రీ బేసిక్స్) పద్ధతికి నో చెప్పిన ట్రాయ్.. తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఇంటర్నెట్ ను ఉచితంగా ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.
ఈ నేపథ్యంలో ట్రాయ్ను సంప్రదించిన కొన్ని కంపెనీలు వెబ్ సైట్ల నిర్వహణ సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన ట్రాయ్ 'అండర్ కనెక్టెడ్' 'అన్ కనెక్ట్ డ్' ల కింద విభజించింది.
వారికి ఏ రకమైన మోడల్ను తీసుకోవాలో సూచనలను జూన్ 16లోగా ఈ-మెయిల్ చేయాలని తెలిపింది. ట్రాయ్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఇంటర్నెట్ నిపుణులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.