కుమార్తె కిడ్నాప్: రక్షించడానికి వెళ్లిన తండ్రి హత్య
ఒడిషా: తన కుమార్తెను రక్షించడానికి వెళ్లిన వ్యక్తి దారుణ హత్యకు గురైనాడు. దుండగులు దారుణంగా ఆయన మీద దాడి చేసి చంపేశారు. ఒడిషాలో ఈ దారుణ సంఘటన జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఒడిషాలోని కలహండి సమీపంలోని సనచెరగావ్ గ్రామంలో దయానిధి మాఝీ (50) అనే గిరిజనుడు నివాసం ఉంటున్నాడు. ఈయనకు 14 ఏళ్ల కుమార్తె ఉంది. శనివారం ఆ బాలికను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి దయానిధి మాఝీ కుమార్తె కోసం గాలిస్తున్నాడు.
సోమవారం కుమార్తె ఉన్న చోటు గుర్తించాడు. కుమార్తెను దాచి పెట్టిన ప్రాంతానికి వెళ్లాడు. తన కుమార్తెను వదిలి పెట్టాలని దుండగులను వేడుకున్నాడు. అయితే రెచ్చి పోయిన నిందితులు దయానిధిని అతి దారుణంగా కొట్టారు. తీవ్రగాయాలు కావడంతో ఆయన కుప్పకూలిపోయాడు.
స్థానిక జిల్లా ఆసుపత్రికి దయానిధి మాఝీని తలించారు. తరువాత మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై దయానిధి మాఝీ మరణించాడని బుధవారం పోలీసులు తెలిపారు. బాలిక కిడ్నాప్, దయానిధి మాఝీని హత్య చేశారని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.