త్రిపురలో ఆగని హింస.. బీజేపీదే ఆ పాపం అంటున్న ప్రతిపక్షాలు..
ఎన్నికల ఫలితాల అనంతరం ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రాజుకున్న హింస ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఫలితంగా కొన్ని వందల ఇళ్లు ధ్వంసమ్యయాయి. ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు చనిపోగా.. వందలాది మంది గాయాలపాలై హాస్పిటల్లలో చికిత్స పొందుతున్నారు.
పరస్పర ఆరోపణలు
రాష్ట్రంలో హింస చేలరేగడంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సీపీఎంలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఫలితాలు వెలువడిన బీజేపీ కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తూ తమ ఆఫీసుల్ని ధ్వంసం చేయడంతో పాటు కార్యకర్తలపై దాడి చేశారని సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీ, సీపీఎం శ్రేణులు తమపై దాడులు చేస్తున్నారని, ఇళ్లు దహనం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 300మంది కార్యకర్తలు హాస్పిటల్ పాలయ్యారని, 250 ఇళ్లు, 100 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయని త్రిపుర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆరోపించారు. అధికార బీజేపీ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని విమర్శించారు.
ఇదీ నేపథ్యం
త్రిపురలో గతేడాది మార్చిలో సీపీఎం ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ అధికారం చేపట్టింది. అప్పటి నుంచి బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. దాడులు, ప్రతిదాడులతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో త్రిపురలోని రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో రాజకీయ కక్షలు మళ్లీ రగులుకొని హింస చెలరేగింది.
హింస తగ్గిందంటున్న బీజేపీ నేతలు
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఎన్నికల హింస కొత్తేమీ కాదు. ప్రతిసారీ ఇక్కడ ఘర్షణలు జరగడం సర్వసాధారణం. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న హింస అంత తీవ్ర స్థాయిలో లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. తమ పాలనలో ఘర్షణలు తగ్గాయని చెప్పుకుంటున్నారు. 2013 ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్లలో 13 మంది చనిపోయారని, ఈసారి మాత్రం ముగ్గురే బీజేపీ నేతలు సమర్థించుకోవడం విశేషం.