విజయ్ ఏకగ్రీవ తీర్మానం. డీలిమిటేషన్పై సమరశంఖం!
కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్రం ముసాయిదాపై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ, తమిళగ వెట్రి కజగం అధినేత, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అధ్యక్షతన చెన్నైలోని కళైవానర్ అరంగంలో పార్లమెంట్ సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్ వంటి మిత్రపక్షాలతో పాటు సీపీఐ, సీపీఎం ప్రతినిధులు పాల్గొని నియోజకవర్గాల పెంపు యత్నాలను తీవ్రంగా నిరసిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు.
లోక్సభ స్థానాల సంఖ్యను పెంచవద్దు!
సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత కార్తి చిదంబరం మీడియాతో మాట్లాడుతూ తమ నిర్ణయాన్ని స్పష్టంగా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్యను అలాగే కొనసాగించాలని, దక్షిణాది ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసేలా ఉన్న ఏ నియోజకవర్గాల సవరణ ప్రక్రియను అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ముఖ్యంగా తమిళనాడుకు కేటాయించిన ఎంపీ స్థానాల్లో ఎలాంటి కోత లేదా అసమాన మార్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. విజయ్ నేతృత్వంలో జరిగిన ఈ చర్చల్లో పీ. చిదంబరం, తొల్ తిరుమావలవన్, సు వెంకటేశన్, దురై వైకో వంటి అగ్రనేతలు పాల్గొని కేంద్ర వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

డీఎంకే, ఏఐఏడీఎంకే బహిష్కరణ...
మరొకవైపు, తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షాలు అయిన డీఎంకే మరియు ఏఐఏడీఎంకే ఈ ఎంపీల సమావేశాన్ని పూర్తిగా బహిష్కరించాయి. ఈ భేటీని ఒక "చౌకబారు నాటకం" అని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే విజయ్ ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసిందని డీఎంకే సీనియర్ నేత ఏ రాజా ఎద్దేవా చేశారు. అసలు పార్లమెంట్లో ఇంకా ఎలాంటి అధికారిక బిల్లు ప్రవేశపెట్టకుండా, దానిపై సమగ్ర అవగాహన కూడా లేకుండా ఇలాంటి భేటీలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. డీఎంకే మిత్రపక్షాలైన ఎంఎన్ఎమ్, డీఎండీకే కూడా ఈ భేటీకి దూరంగా ఉన్నాయి.
కావేరీ అంశంపై మౌనం... బిల్లుపై వేగం ఏంటి?
విజయ్ సర్కార్ తీరుపై ఏఐఏడీఎంకే ఘాటుగా స్పందించింది. కళ్లముందే ఉధృతంగా నడుస్తున్న కావేరి - మేకేదాటు వివాదంపై ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరినా పట్టించుకోని ముఖ్యమంత్రి విజయ్, అసలు ఉనికిలోనే లేని డిలిమిటేషన్ బిల్లుపై అత్యవసరంగా ఈ సమావేశం ఎందుకు నిర్వహించారో చెప్పాలని నిలదీసింది. పార్లమెంట్లో ఎటువంటి బిల్లు తీసుకరాకుండానే అటు ఎంపీలకు లేఖలు పంపి ఇలా ప్రచార ఆర్భాటం చేయడం తొందరపాటు చర్య అని ఏఐఏడీఎంకే ధ్వజమెత్తింది. ఏది ఏమైనా విజయ్ సర్కార్ వేసిన ఈ డిలిమిటేషన్ అడుగు, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రచ్చకు తెరలేపింది.




Click it and Unblock the Notifications