మళ్లీ తెగబడ్డ పాక్: సరిహద్దు వెంబడి కాల్పులు, ఇద్దరు మృతి!
పాక్ సైన్యం తేలికపాటి ఆయుధాలు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్లతో కాల్పులకు దిగినట్టు ఒక అధికార ప్రకటన తెలిపింది. భారత సైన్యం పాక్ కాల్పులను ప్రతిఘటిస్తోందని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ప్రకటనలో పేర్కొ
శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ యథేచ్చగా ఉల్లంఘిస్తూనే ఉంది. వరుసగా మూడో రోజు పాక్ సైన్యం సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పాక్ చేసిన ఈ దుశ్చర్యను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది.
నౌషెరా సెక్టార్లోని రాజౌరి వద్ద పాక్ సైన్యం ఈ కాల్పులకు తెగబడింది. ఉదయం 7.15 గంటలకు చోటు చేసుకున్న ఈ కాల్పుల్లో.. పాక్ సైన్యం తేలికపాటి ఆయుధాలు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్లతో కాల్పులకు దిగినట్టు ఒక అధికార ప్రకటన తెలిపింది. భారత సైన్యం పాక్ కాల్పులను ప్రతిఘటిస్తోందని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. కాగా, గత గురువారం కూడా నౌషెరా సెక్టార్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి కాల్పులకు దిగడంతో.. భారత్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు గాయపడినట్లు సమాచారం. వీరితో పాటు ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్త గాయపడ్డాడు. పాక్ వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో నౌషెరా సరిహద్దు వెంబడి గ్రామాల ప్రజలు వేరే చోటికి తరలిపోతున్నారు.