శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బెంగాల్ పంపండి: బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు
కోల్కతా: మహారాష్ట్ర కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాషాయ పార్టీ ఉద్దేశపూర్వకంగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని చూస్తోందని ఆరోపించారు.
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితి దిగ్భ్రాంతికరంగా ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు, సీఎం ఉద్ధవ్ థాక్రేకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మమతా బెనర్జీ.
శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ.. పశ్చిమబెంగాల్కు పంపాలని, తాము వారికి మంచి ఆతిథ్యం అందిస్తామని మమతా అన్నారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలను గౌహతికి పంపించి వరదలతో సతమతమవుతున్న అస్సాం ప్రభుత్వాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని.. వారిని బెంగాల్ పంపితే మంచి ఆతిథ్యం ఇవ్వడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడతామంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే తనతోపాటు 40 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారని గురువారం ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం వద్ద తగిన మెజార్టీ లేదని తెలుస్తోంది. అయితే, శివసేన రెబల్ నేతలు.. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమితో కాకుండా.. బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.