బెట్టింగ్లకు చట్టబద్ధత కల్పించే యోచనలో కేంద్రం..? ఆర్థిక వ్యవస్థ పటిష్టం కోసమేనా..!
Recommended Video
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1 శనివారం రోజున కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఏమేరకు కేటాయింపులు జరుపుతారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన సమయంలో నిర్మలమ్మ మంత్రం తిరిగి గాడిన పెడుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక భారత్లో ఎప్పటి నుంచో గ్యాంబ్లింగ్, లేదా బెట్టింగ్కు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ ఉంది. ఇప్పుడు బెట్టింగ్లను కూడా చట్టబద్ధత చేస్తారనే వార్త ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతోంది.
ట్టింగ్లకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్
భారతదేశంలో జూదం ఈ నాటిది కాదు. అప్పుడెప్పుడో భారతం కాలం నాటి నుంచే ఉంది. జూదం ఆడి రాజ్యాలు గెలిచిన రాజులున్నారు అదే రాజ్యాలను పోగొట్టుకున్న రాజులు ఉన్నారు. ప్రస్తుతం బెట్టింగ్ అనేది ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పటికీ చాలా ప్రపంచదేశాల్లో దీనికి చట్టబద్దత ఉంది. బెట్టింగ్ ద్వారా ఆయా దేశాలకు అదనపు రెవిన్యూ చేకూరుతుండటంతో ఆదేశాల్లో కొన్ని వందల కోట్ల వరకు బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇక భారత్లో కూడా గ్యాంబ్లింగ్ను చట్టబద్ధత చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే అన్నిటికీ కాకుండా కొన్నిటిని మాత్రమే అది కూడా పరిమితి స్థాయిలో ఉండేలా బెట్టింగ్లకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ ఉంది.
క్రీడల బెట్టింగ్లకు మాత్రమే చట్టబద్ధత
బెట్టింగ్లకు చట్టబద్ధత కల్పించడం వల్ల రెవిన్యూ చేకూరుతుందనేది నిపుణులు చెబుతున్నారు. అయితే భారత్లో క్రీడలకు అత్యంత ఆదరణ ఉండటంతో క్రీడల్లో బెట్టింగ్కు చట్టబద్దత కల్పించాలని గతంలో లా కమిషన్ ఆఫ్ ఇండియా సూచించింది. ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ క్రమంగా విస్తరిస్తున్నందున గత కొన్నేళ్లుగా రెవిన్యూ కూడా బాగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమిస్తుండటంతో లేదా పతనావస్థకు చేరుకుంటున్న నేపథ్యంలో బెట్టింగ్లకు చట్టబద్ధత కల్పిస్తే రెవిన్యూ విపరీతంగా పెరుగుతుందనే వాదనను వినిపిస్తున్నారు ఆర్థిక నిపుణులు.
ఏటా రూ.3 లక్షలు చేతులు మారుతున్నాయి
బెట్టింగ్లకు చట్టబద్ధత లేకపోవడంతో తెలియకుండానే ఏటా కొన్ని వేలకోట్లు చేతులు మారుతున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కీ) చెబుతోంది. ఏడాదికి రూ.3 లక్షల కోట్లు వరకు బుకీల ద్వారా ,అంతర్జాతీయ వెబ్సైట్ల ద్వారా , ఇతర సాంకేతిక వ్యవస్థల ద్వారా చేతులు మారుతున్నాయని ఫిక్కీ చెబుతోంది.
బెట్టింగ్ల ద్వారా ఏటా రూ.19 వేల కోట్లు ఆదాయం
చట్ట బద్దత పేరుతో స్పోర్ట్స్ బెట్టింగ్లకు కేంద్రం కళ్లెం వేస్తోందని దీని ద్వారా ఏటా రూ.19వేల కోట్లు టాక్స్ రెవిన్యూ రూపంలో పోగొట్టుకుంటోందని ఫిక్కీ చెబుతోంది. స్పోర్ట్స్ బెట్టింగ్లపై ఆంక్షలు విధించడంతో అవి సామాజిక ఆర్థిక సమస్యగా మారుతున్నాయని చెప్పిన ఫిక్కీ... మ్యాచ్ఫిక్సింగ్లు స్కాండల్స్కు దారితీస్తున్నాయని అభిప్రాయపడింది . అందుకే ఖజానాకు మంచి రెవిన్యూ కావాలంటే స్పోర్ట్స్ బెట్టింగ్ చట్టబద్దత కల్పిస్తూ ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని ఫిక్కీ కేంద్రప్రభుత్వానికి సూచిస్తోంది. 2018లో ఎంపీ శశి థరూర్ స్పోర్ట్స్ బెట్టింగ్లకు చట్టబద్ధత కల్పించాలంటూ ప్రైవేట్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ లాభం లేకపోయింది.
బెట్టింగ్లకు చట్టబద్ధత కల్పించడంపై కేంద్రం ఆలోచన
ఒకప్పుడు ఆర్థిక వృద్ధి పరంగా భారత్ కంటే వెనకబడిన కొన్ని పొరుగు దేశాలు మనదేశం కంటే ఆర్థిక వృద్ధిలో ముందుగా ఉన్నాయంటే ఆయా దేశాలు బెట్టింగ్లకు చట్టబద్దత కల్పించడమే ప్రధాన కారణం. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఏ రంగం చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగా దేశ ఆర్థిక పరిస్థి ఉంది. ఇలాంటి సమయంలో క్రీడల వరకు మాత్రమే పరిమితి చేస్తూ బెట్టింగ్లకు చట్టబద్ధత కల్పిస్తే ఆర్థిక వ్యవస్థ కాస్త పుంజుకునేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్న కేంద్రం శనివారం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బెట్టింగ్లకు చట్టబద్ధత కల్పిస్తారనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది.