ఆవు పేడపై శాస్త్రవేత్తలకు కేంద్రమంత్రి ఆసక్తికర విజ్ఞప్తి.. ఏమన్నారంటే..
వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆవు పేడపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాస్త్రవేత్తలు ఆవు పేడపై మరిన్ని పరిశోధనలు జరిపాలని విజ్ఞప్తి చేశారు. ఆవు పేడ ఉపయోగంలోకి వస్తే ఆవులు పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత కూడా రైతులకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందన్నారు. ఉత్తరప్రదేశ్లో వీధి పశువుల సమస్య తీవ్రమైందని, ఒకవేళ ఆవుల మూత్రం,పేడ లాభసాటిగా మారితే.. పాలివ్వడం ఆపేశాక రైతులు వాటిని వదిలించుకోవాలనుకోరని అభిప్రాయపడ్డారు. సోమవారం లక్నోలో 12 రాష్ట్రాల వైస్ ఛాన్సలర్లు, వెటర్నరీ అధికారుల కోసం వర్క్షాప్లో గిరిరాజ్ సింగ్ మాట్లాడారు.
ఆవు పాలు,పేడ,మూత్రాన్ని లాభసాటిగా మార్చేందుకు అపారమైన అవకాశం ఉందని,అది దేశ ఆర్థిక వృద్దికి కూడా దోహదపడుతుందని గిరిరాజ్ సింగ్ అన్నారు. గ్రామాల్లో రైతుల పంట పెట్టుబడి తగ్గితే.. అది గ్రామాలు,రైతుల వృద్దిలోకి వచ్చేందుకు తోడ్పడుతుందన్నారు. ఇదే సభలో మహాత్మాగాంధీ,రామ్ మనోహర్ లోహియా,దీన్దయాళ్ ఉపాధ్యాయలను కేంద్రమంత్రి గుర్తుచేసుకున్నారు. ఎలాగైతే గీతా,ఖురాన్,రామాయణ బోధనలను చాలామంది తమ మనస్సుల్లో ఉంచుకుంటారో.. అలాగే తాను మహాత్మాగాంధీ,రామ్ మనోహర్ లోహియా,దీన్దయాళ్ ఉపాధ్యాయల సిద్దాంతాలను మనసులో ఉంచుకుంటానని,వాటినే ఆచరిస్తానని చెప్పారు.
కాగా,ఇటీవల బీఫ్పై చేసిన వ్యాఖ్యలతో గిరిరాజ్ సింగ్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి విదేశాలకు వెళ్తున్న యువత.. అక్కడ బీఫ్ తినేందుకు అలవాడుపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వారికి మన సంస్కృతీ,సంప్రదాయాల గురించి తెలియకపోవడం వల్లే.. అలా తప్పుడు మార్గం పడుతున్నారని అన్నారు. అందుకే దేశ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో భగవద్గీతను బోధించాలని ఆయన సూచించారు.
జనాభా నియంత్రణ కోసం దేశంలో ఓ చట్టం తీసుకురావాలని,ఇందుకోసం ప్రజలే ఉద్యమించాలని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. మూడో సంతానం కలిగి ఉండే కుటుంబాలకు ఓటు హక్కు ఇవ్వవద్దనే ప్రతిపాదనలు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు అని చెప్పారు. జనాభా నియంత్రణ చట్టానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ఆ పార్టీ నాయకులపై కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు రాహుల్ సహా కాంగ్రెస్ నేతలంతా చీర్ లీడర్లుగా మారారంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు.