VHP: ప్రతి హిందువు కు ముగ్గురు పిల్లలు ఉండాల్సిందే..!
హిందువుల్లో జననాల రేటు తగ్గిపోవడంపై విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలు ఉండాలని పిలుపునిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా క్రతువు జరుగుతున్న సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో విశ్వహిందూ పరిషత్ సభ్యులు కేంద్రీయ మార్గదర్శక్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశ వ్యాప్తంగా హిందూ మతాధికారులు, సాధువులు, భక్తులు ఇతర ప్రముఖ వ్యక్తులు హాజరయ్యారు.
హిందువుల్లో జననాల రేటు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బర్త్ రేట్ ను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని విశ్వహిందూ పరిషత్ జాతీయ సెక్రటరీ జనరల్ బజ్ రంగ్ లాల్ బంగ్రా తీర్మానించారు. జననాల రేటు పెరిగితేనే దేశ జనాభాలో సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం తగదని ఓ సీనియర్ విశ్వహిందూ పరిషత్ నాయకుడు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నియంత్రణ నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి కల్పించాలని అన్నారు. దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ కోసం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేసి నమ్మకస్తులైన వారికి ఆ బాధ్యతలు అప్పజెప్పాలని తీర్మానించారు.
'వక్ఫ్ బోర్డు నియంత్రణ కోసం వక్ఫ్ చట్టాన్ని తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ చట్టాన్ని అందరూ ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించాలి. కొన్ని శక్తులు.. దేశంలో హిందువులను అణచివేస్తూ.. భారత్ ను మరో బంగ్లాదేశ్ గా మార్చాలని చూస్తున్నాయి. ఈ విషయం పై హిందువులు ఆలోచించుకోవాలి. దేశం అభివృద్ధిపథంలో నడవాలంటే సామాజిక భాద్యత, పర్యావరణ సంరక్షణ అవసరం' అని ఓ సీనియర్ విశ్వహిందూ పరిషత్ సభ్యుడు వివరించారు.
ప్రయాగ్ రాజ్ లో హిందువుల అభ్యున్నతికి సంబంధించి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నామని.. ఈ భూమి గంగా, యమున, సరస్వతి లాంటి పుణ్య నదుల సంగమం అని జగద్గురు శంకరాచార్య స్వామి వాసుదేవానంద్ సరస్వతి స్వామీజీ తెలిపారు.












Click it and Unblock the Notifications