Fact Check:ఆ వీడియోలో వారు షాహీన్బాగ్ నిరసనకారులు కాదు.. మరెవరు..?
ఢిల్లీ: ఢిల్లీలోని షాహీన్బాగ్ అల్లర్ల సందర్భంగా ఓ వీడియో వైరల్ అయ్యింది. అదే వీడియో మళ్లీ ట్విటర్ వేదికగా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో కనిపిస్తున్న చాలామంది బీజేపీలో చేరారంటూ దానికింద పోస్టు కూడా కనిపించింది. అయితే షాహీన్ బాగ్ అల్లర్లు చెలరేగడానికి బీజేపీనే కారణమని ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వీడియో మరోసారి చక్కర్లు కొడుతోంది.
ఎక్స్ సెక్యులర్ పేరుతో ట్విటర్లో ఈ వీడియో పోస్టు చేయడం జరిగింది. ఇందులో ముస్లిం మహిళలు క్యూలైన్లో నిలబడి డబ్బులు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళలు షాహీన్ బాగ్ నిరసనలు తెలిపినవారంటూ పోస్టులో రాసుకొచ్చారు. "దాదీస్ అండ్ నానీస్ ఆఫ్ షాహీన్బాగ్" అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. అయితే అసలు నిజం వేరుగా ఉంది. అసలు ఈ వీడియో షాహీన్ బాగ్ నిరసనలకు సంబంధించినది కాదని విచారణలో తేలింది. అది ఓల్డ్ ముస్తాఫాబాద్లో జరిగిన అల్లర్లలో సర్వం కోల్పోయిన వారికి సహాయం చేస్తున్న వీడియోగా గుర్తించడమైంది. ఓల్డ్ ముస్తాఫాబాద్ షాహీన్బాగ్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Dadis and nanis of #ShaheenBagh https://t.co/0MXJHPOd5a pic.twitter.com/2NbtqWWcE0
— #AllLivesMatter (@ExSecular) August 18, 2020
ఫిబ్రవరి 23వ తేదీన ఓల్డ్ ముస్తాఫాబాద్లో జరిగిన అల్లర్లలో సర్వం కోల్పోయిన బాబునగర్ మరియు శివ్నగర్ వాసులకు సహాయక చర్యలు చేపడుతున్నప్పటి వీడియో అది. మొత్తం ఆరు రోజుల పాటు ఈ అల్లర్లు జరిగాయి. ముందుగా దీన్ని మార్చి 2వ తేదీన సామాజిక కార్యకర్త చంద్రమోహన్ ఈ ఘటనకు సంబంధించి నిజనిజాలను ఒక వీడియో చేసి ఫేస్బుక్లో పోస్టు చేశారు.అంతేకాదు వైరల్ అయిన వీడియోలో డబ్బులు పంచుతూ కనిపించిన వ్యక్తి షాజాద్ మాలిక్తో చంద్రమోహన్ మాట్లాడారు.
ఆ వీడియోలో ముస్తాఫాబాద్లో బాబునగర్లో అల్లర్లు జరిగిన వారికి సహాయం చేస్తున్నట్లుగా షాజాద్ ధృవీకరించాడు. సహాయం చేసేందుకు తీసుకొచ్చిన సామగ్రి పాడవడంతో షాజాద్ మాలిక్ తన సొంత డబ్బులు రూ.70వేలు బాధితులకు ఇచ్చాడు. ప్రతి వ్యక్తికి రూ.500 ఇచ్చినట్లు చంద్రమోహన్ తన వీడియోలో చెప్పారు. కాబట్టి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో షాహీన్బాగ్లో నిరసనలు చేపట్టిన మహిళలది కాదని తేటతెల్లమైంది.