విలేకరులపై ఉమ్మేసిన విజయ్ కాంత్ (వీడియో)
చెన్నై: డీఎండీకే చీఫ్ క్యాప్టెన్ విజయ్ కాంత్ మీడియాపై దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో నిలిచారు. విజయ్ కాంత్ తీరుపట్ల చెన్నై ప్రెస్ క్లబ్ తో పాటు పలు మీడియా సంఘాలు మండి పడుతున్నాయి.
ఓ పార్టీ చీఫ్, ప్రజాప్రతినిధి అయిన విజయ్ కాంత్ పబ్లిక్ గా మీడియా సభ్యుల మీద ఉమ్మేసి తీవ్ర చర్చకు దారి తీశారు. ఆదివారం విజయ్ కాంత్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంలో ఓ విలేకరి 2016లో జరిగే ఎన్నికల్లో జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.
ఆ సమయంలో విజయ్ కాంత్ సావధానంగానే బదులిచ్చారు. అన్నా డీఎంకే మళ్లీ అధికారం చేపట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తరువాత రెండు మూడు ప్రశ్నలకు జవాబిచ్చారు. అంతలోనే విజయ్ కాంత్ కు పూనకం వచ్చింది.
మీడియా సభ్యుల మీద విరుచుకుపడ్డారు. మీకు జయలలితను ప్రశ్నించే దమ్ము ఉందా అని మీడియా సభ్యులను నిలదీశారు. మీకు భయం, మీరు జర్నలిస్టులేనా అంటూ వారి మీద ఉమ్మేశారు. ఈ విషయంపై విజయ్ కాంత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మీడియా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.