బిజెపికి కాదు, దేశానికి ఓటేయండి: కాంగ్పై మోడీ ఫైర్
ముంబై: దేశంలో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయని అయితే, వచ్చేసారి దేశం కోసం తాను ప్రజలను ఓటు అడుగుతున్నానని గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ముంబైలోని ఎంఎంఆర్డిఏ మైదానంలో జరిగిన సమర శంఖారావం బహిరంగ సభలో మాట్లాడారు. సుపరిపాలన మన జన్మ హక్కు అన్నారు. కానీ ఆరు దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెసు పార్టీయే సమస్యలన్నింటికీ కారణమన్నారు.
కాంగ్రెసు పార్టీ నుండి దేశాన్ని విముక్తం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెసువి ఓటు బ్యాంకు రాజకీయాలన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేస్తే కాంగ్రెసు పార్టీ విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా నేటికీ జల పంపిణీ యుద్ధాలు సాగడం శోచనీయమన్నారు. యువత ఉపాధి లేక అల్లాడుతోందని, ఉపాధి పొందాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సుపరిపాలన అందించేందుకే తాము వచ్చామన్నారు. తాను బిజెపి కోసం ఓటు అడగడం లేదని, దేశం కోసమే అడుగుతున్నానని చెప్పారు. ముస్లింల కోసం కాంగ్రెసు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందని కానీ, ఆ వర్గానికి ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుంటున్నారన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసునన్నారు. కాంగ్రెసు నల్ల ధనాన్ని ఎందుకు వెనక్కి తీసుకు రాలేకపోతుందో చెప్పాలన్నారు.
భారత దేశంలో ఇన్ని భాషల్లో, ఇన్ని చిత్రాలు తీస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక ఫిల్మ్ యూనివర్సిటీ లేదన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం ముంబైలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీని కూడా పారద్రోలాలన్నారు. బ్రిటిష్ వారి విభజించి పాలించు అన్న సూత్రాన్ని కాంగ్రెసు పార్టీ అమలుపరుస్తోందన్నారు. మహారాష్ట్ర తమకు పెద్దన్నలాంటిదని, గుజరాతీయులకు ముంబై మరో నివాసమన్నారు.
కాగా, సభ ముగింపు సమయంలో మోడీ భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేయించారు. మరోవైపు చాయ్ వాలాలు ప్రత్యేక ఆహ్వానితులుగా తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications