ఉత్కంఠకు తెర: కొద్ది గంటల్లో ఏపీ అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికల ఫలితాలు
దేశంలోని కోట్లాది మంది ప్రజలతోపాటు యావత్ ప్రపంచ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. మొత్తం 542 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు సుదీర్ఘంగా ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 543 లోక్సభ స్థానాలుండగా గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 542లోక్సభ స్థానాలకే ఎన్నికలు జరగ్గా.. మంగళవారం (జూన్ 4న) లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి కానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు, ఒడిశాలో 21 లోక్సభ స్థానాలతో పాటు 147 శాసనసభ స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో 25 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల లెక్కింపు, ఫలితాలు నేడే వెలువడనున్నాయి.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచే సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అరగంట తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను గణిస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు లేకుంటే నేరుగా ఈవీఎంలలో పోలైన ఓట్లనే లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయిస్తారు. ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు.

దేశంలోనే అత్యధికంగా 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో 75 జిల్లాలోని 81 లెక్కింపు కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. మహారాష్ట్రలో 48 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా, 289 కౌంటింగ్ హాళ్లు, 4, 309 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 14,507 మంది సిబ్బంది ఓట్లు లెక్కిస్తారని అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు సహా 525 మంది పోటీలో ఉన్నారు. 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కించనున్నారు. ఆర్మూరు, భద్రాచలం, ఆశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సుమారు 10 వేల మంది సిబ్బంది పని చేయనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు 144 సెక్షన్ విధించనున్నారు. మద్యం దుకాణాలను బంద్ చేయనున్నారు. మొదటి ఫలితం నిజామాబాద్ స్థానం నుంచి వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఫలితాలు: కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 3.33 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అలాగే 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని, 26,473 మంది హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు వేశారని తెలిపారు. దీంతోపాటు 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వేశారన్నారు. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని, 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని తెలిపారు. కొన్ని చోట్ల లోక్సభ కౌంటింగ్ హాల్స్ వద్ద పోస్టల్ ప్రత్యేకంగా లెక్కింపు జరుగుతుందని, వేరే హాల్లో అక్కడ 8 గంటలకు ఈవీఏం కౌంటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు. పార్లమెంటు నియోజక వర్గాలకు 2,443 ఈవీఎం టేబుల్స్, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉన్నాయన్నారు. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుల్స్, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని వివరించారు.
కౌంటింగ్ ప్రక్రియ పరిశీలనకు 119 మంది అబ్జర్వర్లను నియమించిందని, టేబుల్కు మైక్రో అబ్జర్వర్లను నియమించిందన్నారు. అమలాపురం పార్లమెంటుకు 27 రౌండ్లు పడుతుందని, పూర్తి ఫలితాలు వచ్చేందుకు దాదాపు 9 గంటల సమయం పడుతుందని తెలిపారు. అలాగే రాజమండ్రి, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉన్నాయని, ఫలితాలు వచ్చేందుకు 5 గంటల సమయం పడుతుందన్నారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంల్లో 26 రౌండ్లు పడుతుందన్నారు. కొవ్వూరు, నరసాపురం ల్లో 5 గంటల్లో ఫలితాలు వస్తాయన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.












Click it and Unblock the Notifications