We are 162: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరేడ్: హేమాహేమీలతో కిటకిటలాడుతున్న హోటల్.. !
ముంబై: మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమి శాసన సభ్యుల పరేడ్ ఆరంభమైంది. తమకు 162 మంది శాసన సభ్యుల బలం ఉందని ప్రకటించిన కూటమి నాయకులు.. ఆ వెంటనే- తమ బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు. ముంబైలోని హోటల్ గ్రాండ్ హయత్ వద్ద ఈ మూడు పార్టీలకు చెందిన 162 మంది శాసన సభ్యులతో పరేడ్ ను ఏర్పాటు చేశారు. దీనికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ తదితరులు హాజరయ్యారు.
మహారాష్ట్ర మహాట్విస్ట్! ఎన్నికలకు ముందే బీజేపీ ప్లాన్-బీ సిద్ధం చేసిందా? అసలేం జరిగిందంటే.?
వుయ్ ఆర్ 162 అనే బ్యానర్లు..
ప్రస్తుతం హోటల్ గ్రాండ్ హయత్ వద్ద వాతావరణం సందడిగా మారింది. ఎటు చూసినా వుయ్ ఆర్ 162 అనే బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఒకరి తరువాత ఒకరుగా శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలకు చెందిన హేమాహేమీల్లాంటి నాయకులు హోటల్ వద్దకు చేరుకుంటుండటంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తుల భారీ సంఖ్యలో హోటల్ వద్దకు చేరుకున్నారు. తమ, తమ పార్టీల నాయకులకు అనుగుణంగా నినాదాలు చేస్తున్నారు. జిందాబాద్ లు కొడుతున్నారు.
లాంగ్ లీవ్ మహా వికాస్ అఘాడీ అంటూ
మూడు పార్టీల ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికి జిందాబాద్ లు కొడుతూ కనిపించారు. లాంగ్ లీవ్ మహా వికాస్ అఘాడీ అంటూ వారు నినాదాలు చేశారు. చాలాసేపటి వరకూ సంకీర్ణ కూటమి వర్ధిల్లాలని అంటూ నినదించడం కనిపించింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం కాగా.. దీనికి మించి 162 మంది సభ్యుల బలం తమ వద్ద ఉందంటూ శివసేన నాయకులు చెబుతున్నారు. 162 మందిలో ఏ ఒక్కరు కూడా బీజేపీ-అజిత్ పవార్ ల వైపు మొగ్గు చూపడానికి ఏ మాత్రం ఇష్టపడట్లేదని వెల్లడిస్తున్నారు.
మా బలమేంతో మీరే చూడండి..
`ఈ సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ హయత్ వద్ద కూటమి శాసన సభ్యులతో పరేడ్ ను ఏర్పాటు చేయబోతున్నాం. మా బలం 162. మా బలమేంటో, పరేడ్ శక్తి ఏమిటో వచ్చి, మీరే చూడండి..` అని సోమవారం మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు. 145 మంది ఎమ్మెల్యే మ్యాజిక్ ఫిగర్ లేనప్పటికీ.. బీజేపీ నాయకులు అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సంజయ్ రౌత్ విమర్శించారు.