కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్యకు మాకు సంబంధం లేదు, హిందూ సంస్థలు, టార్గెట్!
బెంగళూరు: ప్రముఖ కన్నడ లంకేష్ పత్రిక యజమాని, ఎడిటర్ గా పని చేస్తూ హత్యకు గురైన గౌరీ లంకేష్ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని సనాతనా సంస్థ, హిందూ జనజాగృతి సంస్థ మంగళవారం స్పష్టం చేశాయి.
సంయుక్త ప్రకటన
సనాతనా సంస్థ, హిందూ జనజాగృతి సంస్థలు మంగళవారం సంయుక్తంగా పత్రికా ప్రకటన జారీ చేశాయి. కావాలనే గౌరీ లంకేష్ హత్య కేసుకు సంబంధించి మా సంస్థల మీద ఆరోపణలు చేస్తున్నాయని సనాతనా, హిందూ జనజాగృతి సంస్థలు ఆరోపించాయి.
సంబంధం లేదు
గౌరీ లంకేష్ హత్య కేసులో అరెస్టు అయిన నిందితులు సనాతనా సంస్థ కార్యకర్తలు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం ఆ సంస్థలు, మాకు ఈ హత్య కేసుకు ఎలాంటి సంబంధం లేదని పత్రికా ప్రకటన విడుదల చేశాయని సమాచారం.
టార్గెట్ చేస్తున్నారు
మా సంస్థలను టార్గెట్ చేసుకుని కావాలనే హిందూ కార్యకర్తలను అంతం చెయ్యడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆ సంస్థలు ఆరోపించాయి. లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ ను తాము ఎందుకు హత్య చేయిస్తాము అంటూ ఆ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
650 పేజీల చార్జ్ షీటు
2017 సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి బెంగళూరులో గౌరీ లంకేష్ ను ఆమె ఇంటిలోనే రివాల్వర్ తో కాల్చి చంపారు. గౌరీ లంకేష్ హత్య కేసులో నవీన్ కుమార్ అలియాస్ హోట్టే మంజును ఇప్పటికే అరెస్టు చేశారు. ఇదే కేసుకు సంబంధించి ఇటీవల మరో నలుగురిని అరెస్టు చేసిన సిట్ అధికారులు 650 పేజీల చార్జ్ షీటు కోర్టులో సమర్పించారు.