మమత బెనర్జీకి మరో సడన్ షాకిచ్చిన సీఎం సువేందు: 100 రోజుల పాలన నాడు.. !!
పశ్చిమ బెంగాల్ లో అధికార మార్పిడి అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీకి వరుస షాకులను ఇస్తోందక్కడి ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పటికే ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయక్కడ. వ్యతిరేకంగా ప్రచారం చేసిన సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సువేందు అధికారి మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఖేలా హోబే దివస్ ను మార్చివేశారు. దీనికి బదులుగా ఇకపై ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కు గుర్తుగా ఆయుష్మాన్ దివస్ ను జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఓ ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 16న ఆయుష్మాన్ దివస్ ను జరుపుకొంటామని వెల్లడించారు.

తూర్పు మేదినీపూర్ జిల్లాలోని తమ్లుక్లో జరిగిన బీజేపీ ప్రత్యేక సంస్థాగత సమావేశం అనంతరం సువేందు అధికారి విలేకరులతో మాట్లాడారు. ఆయుష్మాన్ దివస్ కార్యక్రమాన్ని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. ఆ రోజున పాటించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తోన్నామని పేర్కొన్నారు. ఆగస్టు 16వ తేదీని కోల్కతా చరిత్రలో ఒ బ్లాక్ డే గా అభివర్ణించారాయన. ఆ తేదీ నుంచే సుహ్రావర్ది నాయకత్వంలో గ్రేట్ కలకత్తా హత్యలు జరిగాయని గుర్తు చేశారు.
గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని ఖేలా హోబే దివస్ గా పాటించిందని తాము ఆ రోజును ఆయుష్మాన్ దివస్గా జరుపుకొంటామని అన్నారు. బ్రిటిష్ ఇండియా చరిత్రలోనే మత హింసా సంఘటనలలో ఒకటిగా నిలిచిన ఉదంతం అది. దీనిని గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అని పిలుస్తారు. ఈ ఘటనలో హిందూ, ముస్లింల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. సుమారు 4,000 మంది మరణించగా, 10,000 మందికి పైగా గాయపడ్డారు. అప్పుడు ముస్లిం లీగ్ నాయకుడు హుస్సేన్ షహీద్ సుహ్రావర్ది అవిభక్త బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
2021లో అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. యువతలో క్రీడలను ప్రోత్సహించడానికి ఆగస్టు 16వ తేదీని ఖేలా హోబే దివస్ గా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని రద్దు చేశారు సువేందు అధికారి. ఆయుష్మాన్ దివస్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని, ఆరోగ్య బీమా కవరేజీని అమలు చేయడానికి ఉద్దేశించిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications