lockdown continue: ఇక్కడే ఉండండి, మీ భద్రత మాది, వలసకూలీలకు ఉద్దవ్ భరోసా, అమిత్ షా ఫోన్..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించడంతో బాంద్రా రైల్వేస్టేషన్కు వలసకూలీలు రావడంతో ఆందోళన నెలకొంది. తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు కోరినా.. నిరాకరించడంతో లాఠీఛార్జీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు చేరడంతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే మీడియాతో మాట్లాడారు. కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలని కోరారు. కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచం మొత్తం అల్లాడిపోతుందని వివరించారు. ఈ సమయంలో పండుగలు అన్ని ఇంట్లోనే జరుపుకుంటున్నామని చెప్పారు. ఇవాళ అంబేద్కర్ జయంతి..భీమ్ సైనికులు అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా గుమిగూడలేదని గుర్తుచేశారు.
ఇక్కడే ఉండండి..
వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న క్రమంలో అందరూ సహకరించాలని కోరారు. తిరిగి ఇంటికి వెళ్లాలని వలస కూలీలను కోరారు. మీరు ఎందుకు ఇంటికి వెళ్లాలి అనుకొంటున్నారు.. ఇక్కడే ఉండొచ్చు కదా అని కోరారు. మిమ్మల్ని భద్రంగా చూసుకుంటాం.. దయచేసి ఇంటికెళ్లాలి అని మాత్రం అనుకోకండి అని ఉద్దవ్ థాకరే కోరారు. దీంతోపాటు వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని..ముంబైలోనే 22 వేల మందిని పరీక్షించామని గుర్తుచేశారు. పాజిటివ్ కేసులు 2 వేల 334కి చేరిందని.. ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే వీరిలో 230 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారని పేర్కొన్నారు.
కమిటీ ఏర్పాటు
వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నామని థాకరే పేర్కొన్నారు. ఇందుకోసం ఒక కమిటీని కూడా వేశామని తెలిపారు. రాష్ట్రంలో గల 10 జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం లేదు అని.. మిగతా జిల్లాల నుంచి కూడా వైరస్ను తరిమికొడతామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కరోనా ఫ్రీ రాష్ట్రంగా మారుస్తామని ఉద్దవ్ థాకరే స్పష్టంచేశారు. ముంబై, పుణేలో హాట్ స్పాట్ కేంద్రాలను మరింత విసృతం చేస్తామని చెప్పారు. కరోనా వైరస్కు వ్యతిరేకంగా మహారాష్ట్ర పోరాడుతుందని ఉద్దవ్ థాకరే తెలిపారు.
అమిత్ షా ఫోన్..
అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉద్దవ్ థాకరేకు ఫోన్ చేశారు. బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద గల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ఉద్దవ్కు అమిత్ షా సూచించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.