దానర్థం మీకు తెలియదా?: శశికళ న్యాయవాదిపై సుప్రీం ఆగ్రహం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తరపు న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది.
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తరపు న్యాయవాదిపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన ఆమె లొంగిపోవడానికి సమయం కోరడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10కోట్ల జరిమానా విధిస్తూ.. వెంటనే లొంగిపోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
అయితే శశికళ కోర్టులో లొంగిపోవడానికి సమయం కోరుతూ సుప్రీంను ఆశ్రయించింది.
అనారోగ్యం కారణంగా కోర్టులో లొంగిపోవడానికి నాలుగు వారాల సమయం కోరుతూ శశికళ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. అంతేగాకుండా 'తక్షణమే' అన్న పదానికి అర్థం మీకు తెలుసు కదా? అంటూ ఆమె తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. మంగళవారం తీర్పులో శశికళను తక్షణమే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

శశికళ లొంగిపోయేందుకు గడువు ఇచ్చేది లేదని వెంటనే లొంగిపోవాలని కోర్టు మరోసారి ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఇచ్చిన తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన కేసులో ఏ2గా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్లకు కూడా శిక్ష పడింది.
శశికళ లొంగిపోతారు.. అరెస్ట్ వారెంట్ వద్దు
జయలలిత, శశికళ అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడిన శశికళకు మరో గండం ఎదురుకానుంది. అనారోగ్యం దృష్ట్యా లొంగిపోయేందుకు గడువు కావాలని శశికళ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై స్పందించిన శశికళ న్యాయవాది బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసుకున్నారు. శశికళ బుధవారం సాయంత్రంలోగా లొంగిపోతారని.. అరెస్ట్ వారెంట్ జారీ చేయొద్దని కోర్టుకు విన్నవించారు.












Click it and Unblock the Notifications