జూన్ 21: 192 దేశాల్లో 200కోట్ల మంది యోగా!
న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు భారీగా ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 21న నిర్వహించనున్న తొలి యోగా దినోత్సవంలో 192 దేశాల నుంచి దాదాపు 200 కోట్ల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఐరాసలో జరిగే వేడుకలకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ నేతృత్వం వహించనున్నారు.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్, ప్రధానసభ అధ్యక్షుడు శామ్ కుతేశా, భారత ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ రవిశంకర్, పలువురు దౌత్యవేత్తలు, భారత్ నుంచి హాజరయ్యే విద్యార్థులు, ఐరాస అంతర్జాతీయ పాఠశాల విద్యార్థులు ఐరాసలో నిర్వహించే వేడుకలో పాల్గొంటారని అక్కడి భారత రాయబారి అశోక్ ముఖర్జీ చెప్పారు.

ఐరాస ప్రధాన కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సుష్మాస్వరాజ్, ఐరాస సెక్రటరీ జనరల్, ప్రధాన సభ అధ్యక్షుడు.. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్కు చేరుకుని అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. టైమ్స్క్వేర్లో 30వేల మంది యోగా చేస్తారని అంచనా వేస్తున్నారు. ఐరాస వేడుకలను అక్కడ భారీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
ఇది ఇలా ఉండగా ఖాట్మాండ్తో సహా నేపాల్లోని వివిధ నగరాల్లో భారత్.. యోగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మరోవైపు ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద కార్యక్రమం నిర్వహించనున్న వేదిక వద్ద భద్రతా బలగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ప్రముఖులు ఇక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇది ఇలా ఉండగా, సముద్ర మట్టానికి దాదాపు 12వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ బేస్ క్యాంపు సైన్యానికి చెందిన దాదాపు 500 దళాలు యోగా కార్యక్రమంలో పాల్గొంటాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
పశ్చిమాన మధ్యదరా సముద్రంలో, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో, దక్షిణ హిందూ మహాసముద్రంలో మోహరించి ఉన్న నౌకాదళ బలగాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నాయి.యోగాసనాలను దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలని నౌకాదళం నిర్ణయించింది.

అపోహలు తొలగించేందుకు యోగాపై పుస్తకం
కాగా, యోగాపై కొన్ని వర్గాలు వ్యతిరేకత కనబరుస్తున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్కు చెందిన ముస్లిం రాష్ట్రీయ మంచ్... యోగాపై దురభిప్రాయాన్ని పోగొట్టేందుకు ఒక పుస్తకాన్ని వెలువరించింది.
కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. యోగాసనాలకు, నమాజ్కు మధ్య సారూప్యం ఉందని ఇందులో వివరించింది. నమాజ్లోని ప్రతి చర్యలోనూ యోగా ఉందని ఈ విభాగం అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications