వరుస పేలుళ్లతో వణికిన ఇజ్రాయెల్- బీభత్సం..!!
Israel: గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై సుదీర్ఘకాలం పాటు వరుసబెట్టి దాడులు సాగించిన ఇజ్రాయెల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. గంటల వ్యవధిలో మొత్తం మూడు బస్సుల్లో సంభవించిన ఈ పేలుడు ఘటనలతో ఆ దేశం ఉలిక్కిపడింది. హైఅలర్ట్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి బట్ యామ్ సిటీలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు గానీ భద్రతపరంగా అనేక అనుమానాలకు తెర తీసింది. దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది ఇజ్రాయెల్. దీని వెనుక పాలస్తీనా టెర్రరిస్టులు ఉండొచ్చని పేర్కొంది.

ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భద్రత సమావేశం నిర్వహిస్తోన్న సమయంలోనే పేలుళ్లు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా దీన్ని ఉగ్రవాద దాడిగా అనుమానిస్తోన్నామని అన్నారు.
బట్ యామ్ సిటీలో మొత్తం అయిదు బస్సుల్లో భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలను ఉంచారని, రిమోట్ ద్వారా వాటిని పేల్చివేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తం అయిదు బస్సుల్లో పేలుడు పదార్థాలను గుర్తించామని తెలిపారు. మూడింట్లో అమర్చినవి పేలిపోయాయని, మరో రెండింట్లో ఉన్న బాంబులను నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంభవించినట్లు చెప్పారు.
పేలుడు కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్పోజ్డ్ డివైజ్ను వినియోగించినట్లు బట్ యామ్ పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఆయా బస్సుల్లో ఎవరూ లేకపోవడం వల్ల భారీగా ప్రాణనష్టం తప్పింది. ఈ దాడి పట్ల ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. దీన్ని తీవ్రమైన ఘటనగా భావిస్తోన్నామని తెలిపింది. వెస్ట్ బ్యాంక్ ఉగ్రవాద శక్తుల చర్యగా వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications