హోటల్లో భారీ అగ్ని ప్రమాదం: 75మంది మృతి
మనీలా: ఫిలీప్పీన్స్ రాజధాని మనీలాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 75మంది మృత్యువాత పడ్డారు. క్యూజన్ నగరంలోని ఆరు అంతస్థుల మానోర్ హోటల్లో బుధవారం ఉదయం 4.30గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది.
షాట్ సర్క్యూట్ కారణంగా మూడో అంతస్థులో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై హోటల్ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కొంతమంది తప్పించుకోగా, 75మంది మంటల్లో చిక్కుకొని మృతి చెందారు.
మరో 35మందికి గాయాలయ్యాయి. హోటల్లో మొత్తం 170మందికిపైగా ప్రజలు ఉన్నట్లు సమాచారం. కాగా, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఘటనపై క్యూజన్ అగ్నిమాపక విభాగ అధికారి మాట్లాడుతూ.. ప్రమాద సమయాల్లో బయటపడేందుకు ఎలాంటి వీలులేకుండా హోటల్ నిర్మాణం ఉందని, దీనిపై మూడు నెలల క్రితమే హోటల్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. కిటికీలకు గ్రిల్స్ ఉండటంతో ప్రజలు హోటల్ నుంచి తప్పించుకోలేకపోయారని అన్నారు.
అగ్ని ప్రమాదాలు జరగకుండా హోటల్ యాజమాన్యం సరైన చర్యలు చేపట్టలేదని అధికారులు చెప్పారు. ఐదేళ్ల క్రితం నగరంలోని ఓ ప్రముఖ డిస్కోలో ఈ విధంగానే అగ్ని ప్రమాదం జరిగి 160 మంది ప్రజలు మృతి చెందారు.












Click it and Unblock the Notifications