గగనతలం మూసివేత - విమానాల రద్దు, దారి మళ్లింపు..!!
ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ, ముంబై నుంచి లండన్, న్యూయార్క్ కు వెళ్లే అనేక విమానాల పైన ప్రభావం పడింది. పలు విమానాలను దారిమళ్లించగా.. మరికొన్ని వెనక్కి తిరిగివస్తున్నాయి. దాదాపు 16 ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్లైన్స్ వెల్లడించింది.
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్పై ముందస్తు దాడులకు దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక ప్రకటన చేసారు. ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభించామని ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఇరాన్ ముప్పును తిప్పికొట్టడమే టార్గెట్గా సైనిక చర్య చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇరాన్ ముప్పు తొలగించడానికి ఎన్ని రోజులైనా ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.

ఇజ్రాయెల్ జరిపిన దాడి కారణంగా ఇరాన్ తమ గగనతలాన్ని మూసివేసింది. ఈ పరిణామంతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ131ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. అలాగే, మొత్తం 16 విమానాలను ఎయిరిండియా దారి మళ్లించింది. కాగా, పలు విమానాలను వెనక్కు పిలిచింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో అప్పటికే ప్రయాణంలో ఉన్న పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా విమానాన్ని కూడా దారి మళ్లించారు. ఈ ఘటన కారణంగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరడంలో కొంత ఆలస్యం జరగనుంది. ప్రస్తుతానికి, విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏయిర్ ఇండియా ఎప్పటికప్పుడు తమ సర్వీసుల గురించి ప్రయాణీకుల కు సమాచారం అందించేందుకు ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications