ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను పిలవండ్రా: భారత్ తో ఉద్రిక్తతల వేళ..
Asmi Munir US visit: ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.
ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం పడింది.. భారత్ పై.

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.
ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ తో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోన్నారు డొనాల్డ్ ట్రంప్. గతంలో ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ తో కలిసి వైట్ హౌస్ లో ప్రైవేట్ గా భోజనం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో సమావేశం కావడం తనకు దక్కిన గౌరవమని వ్యాఖ్యానించారు.
అసీమ్ మునీర్ తో కలిసి వైట్ హౌస్ లో లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడొకరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ లో ఏకాంతంగా ఆతిథ్యాన్ని ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ ఘటన.. అప్పట్లో భారత్ లో చర్చనీయాంశమైంది. అమెరికా వైఖరి పట్ల వ్యతిరేకత ఎదురైంది.
అసిమ్ మునీర్ కు ఏకంగా వైట్ హౌస్ లో ప్రవేశం లభించడమే గొప్ప అనుకుంటే.. ఏకాంతంగా డొనాల్డ్ ట్రంప్ తో భోజనం చేయడం, ఆతిథ్యాన్ని పొందడం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ట్రంప్ బలహీనత మీద పాకిస్తాన్ దృష్టి పెట్టిందని, అదే ఆయనను వైట్ హౌస్ లో అడుగు పెట్టేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య అసిమ్ మునీర్ కు మరోసారి అమెరికా నుంచి పిలుపు అందింది. దీంతో ఈ నెలాఖరులో ఆ దేశ పర్యటనకు మునీర్ బయలుదేరి వెళ్లనున్నారు. నెలన్నర రోజుల వ్యవధిలో ఆయన అమెరికాలో పర్యటించడం ఇది రెండోసారి అవుతుంది. భారత్ తో ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రతరమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా వీడ్కోలు కార్యక్రమానికి మునీర్ హాజరుకానున్నారు. మిడిల్ ఈస్ట్ దేశాలపై ఆయనకు గట్టిపట్టు ఉంది. ఆయా దేశాల్లో అమెరికా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించారు. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు.
రెండు నెలల కిందట.. అమెరికా అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అయిదుమంది ఐసిస్-ఖోరాసన్ (ISIS-K) ఉగ్రవాదులను పట్టుకున్నందుకు పాకిస్తాన్ ను ప్రశంసించారు కురిల్లా. ఉగ్రవాదాన్ని నిరోధించడంలో పాకిస్తాన్ ఓ అద్భుతమైన భాగస్వామిగా అభివర్ణించారు. అందుకే పాకిస్తాన్ తో భారత్తో సంబంధాలు కొనసాగించాలని కూడా సూచించారు.
జూలైలో కురిలా పాకిస్తాన్ లో పర్యటించారు. ఇస్లామాబాద్ను సందర్శించారు. ఆ సందర్భంగా ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నిషాన్-ఎ-ఇంతియాజ్ను ప్రదానం చేసింది పాకిస్తాన్. ఈ పరిణామాలు ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న సైనిక, వ్యూహాత్మక సంబంధాలు, భాగస్వామ్యానికి అద్దం పట్టినట్టయింది.












Click it and Unblock the Notifications