చైనాలో చారిత్రక ఘట్టం: మరోసారి అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ పట్టానికి రంగం సిద్ధం
బీజింగ్: చైనా రాజకీయాల్లో కీలక ఘట్టానికి వేదిక నిలిచే చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) నాలుగు రోజుల కాంక్లేవ్ సోమవారం ప్రారంభమైంది. కాగా, మరోసారి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు మూడోసారి అధికారం కట్టబెడుతూ తీర్మానం చేసింది. చైనా అధ్యక్షుడిగా సీ జిన్పింగ్కు మూడోసారి కొనసాగేలా ఈ సమావేశాల్లో ఆమోదం తెలిపారు. 400 మంది సీపీసీ సెంట్రల్ కమిటీ సభ్యులు సమావేశాలకు హాజరయ్యారని ప్రభుత్వ వార్తా ఏజెన్సీ తెలిపింది.
వచ్చే ఏడాది చైనా జాతీయ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్పింగ్ పాత్ర చాలా క్రియాశీలకమైదని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నేతగా మారిన జిన్పింగ్ ఎదిగారని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు.
జిన్ పింగ్కు జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం ఉందని, అందుకు ఈ సమావేశాలే కీలకమని అంటున్నారు. కాగా, తాజాగా ప్రవేశపెట్టనున్న తీర్మానానికి పార్టీ చరిత్రలో ప్రత్యేకమైనది. వందేళ్ల సీపీసీ చరిత్రలో 'చారిత్రక తీర్మానం'ను రెండుసార్లు మాత్రమే ప్రవేశపెట్టారు. 1945లో మావో, సాంస్కృతిక విప్లవం పేరుతో 1981లో డెంగ్.. చారిత్రక తీర్మానాలను తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రవేశపెట్టనున్న మూడో చారిత్రక తీర్మానం ఇదే కానుంది.
షీ జిన్పింగ్ రాజకీయ స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా తీర్మానం ఉంటుందని చైనా రాజకీయ విశ్లేషకుడు వాంగ్ షింగ్వేయి తెలిపారు. పార్టీ తర్వాతి నాయకత్వం గురించి ప్రస్తావించే అవకాశాలు లేవని అన్నారు. పార్టీపై జిన్పింగ్కు ఉన్న పట్టు, ఆయన శక్తిసామర్థ్యాలు ఈ తీర్మానం ద్వారా మరోసారి నిరూపితమవుతాయని తెలిపారు.
కాగా, వచ్చే ఎన్నికల నాటికీ షీ జిన్పింగ్ మినహా తమ రెండో దఫా పూర్తి చేసుకున్న నేతలందరూ పదవిలో నుంచి దిగిపోయే అవకాశం ఉంది. రెండుసార్లు అధ్యక్ష పదవి చేపట్టిన వారు మరోసారి పోటీ చేయకూడదనే నిబంధన ఇదివరకు ఉండగా.. దీన్ని 2018 రాజ్యాంగ సవరణ ద్వారా జిన్పింగ్ మార్చేశారు. అయితే, వచ్చే ఏడాది జిన్పింగ్ రెండోదఫా అధ్యక్ష పదవీ కాలం ముగియనుంది. ఆ తర్వాత కూడా అధ్యక్షుడిగా కొనసాగాలని ఆయన ఆశిస్తున్నారు.
సీపీసీలో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగిన జిన్పింగ్.. ఇప్పటికే పార్టీలోని కీలక స్థానాలను గుప్పిట పెట్టుకున్నారు. దేశాధ్యక్షుడిగా, సీపీసీ జనరల్ సెక్రెటరీగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు. మరోవైపు, సీపీసీ తీసుకునే కీలక నిర్ణయాలను సమావేశాల చివరి రోజున ప్రకటించడం ఆనవాయితీ. సంస్కరణలు, కొత్త నియామకాలు, సిద్ధాంతాలు, పార్టీ బలోపేతానికి చేపట్టే చర్యలను చివరి రోజు వెల్లడిస్తారు.
Recommended Video
తాజా సమావేశాల్లో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక సహా పార్టీలో పదవులు చేపట్టేందుకు ఉన్న వయోనిబంధనపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 68 ఏళ్లు దాటిన వారు అనధికారికంగా పదవీ విరమణ చేసే సంప్రదాయాన్ని మావో తర్వాత పగ్గాలు చేపట్టిన డెంగ్ షియావోపింగ్ తీసుకొచ్చారు. దీని ప్రకారం చూస్తే.. ప్రస్తుత పొలిట్బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో 12 మందికి వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి 68 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధనను సడలిస్తారా అనే అంశంపై తాజా సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా, మరోసారి చైనా అధ్యక్షుడిగా కూడా షీ జిన్పింగ్ కొనసాగనున్నారు.