‘యుద్ధం కావాలంటే సిద్ధం’.. ట్రంప్ సుంకాలపై చైనా పరోక్ష హెచ్చరిక !
అమెరికాలో ఫెంటానిల్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరోసారి ఉక్కుపాదం మోపారు. ఫెంటానిల్, దాని తయారీకి ఉపయోగించే రసాయనాల సరఫరాను అడ్డుకోవడంలో చైనా విఫలమైందనే కారణంతో ట్రంప్ యంత్రాంగం చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. ఇది ఇరు దేశాల మధ్య రగులుతున్న వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది.
టారిఫ్ల మోత..
ఇప్పటికే 10 శాతం సుంకాలు ఉండగా, అదనంగా మరో 10 శాతం సుంకాన్ని ట్రంప్ సర్కార్ విధించింది. మంగళవారం నుంచే ఈ కొత్త సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇదే బాటలో కెనడా, మెక్సికోలపైనా ఇదే కారణంతో సుంకాలు విధించడం గమనార్హం. ఈ చర్యలు దాదాపు 2.2 ట్రిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యంపై ప్రభావం చూపుతాయని అంచనా. అంతేకాదు, ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికన్లకు ఇది మరింత భారంగా మారనుంది.

చైనా ఘాటు ప్రతిస్పందన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చైనా పై విధించిన తాజా సుంకాలపై చైనా తీవ్రంగా స్పందించింది. ఫెంటానిల్ సరఫరా విషయంలో చైనాను ముద్రవేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన చైనా, అమెరికా తనపై విధించిన 10% అదనపు సుంకాలను అన్యాయంగా అభివర్ణించింది. ఈ అంశంపై వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదిక 'X'లో పోస్ట్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చైనా పరోక్ష హెచ్చరిక - 'యుద్ధం కావాలంటే సిద్ధం'
"ఫెంటానిల్ సమస్యను నిజంగా పరిష్కరించాలని అమెరికా కోరుకుంటే, చైనాతో సమాన స్థాయిలో చర్చలు జరపాలి. కానీ, అమెరికా యుద్ధం కోరుకుంటే - అది టారిఫ్ వార్ అయినా, ట్రేడ్ వార్ అయినా, లేదా మరే ఇతర యుద్ధమైనా - మేము తుది వరకు పోరాడేందుకు సిద్ధం" అని చైనా రాయబార కార్యాలయం తేల్చి చెప్పింది. అటు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ వివాదంపై కఠినంగా స్పందించింది. ఫెంటానిల్ సరఫరా అంశాన్ని సుంకాల పెంపునకు ఓ కారణంగా చూపుతున్న అమెరికా, వాస్తవానికి తన తప్పిదాలను ఇతరులపై నెట్టాలని చూస్తోందని చైనా ఆరోపించింది. "ఫెంటానిల్ మాఫియాను అరికట్టేందుకు మేము అమెరికాకు సహాయం చేస్తే, మాకే శిక్ష విధిస్తున్నారా? ఇది ఎంతవరకు న్యాయసమ్మతం?" అంటూ చైనా మంత్రిత్వ శాఖ మండిపడింది.
ట్రంప్ నిర్ణయం - వాణిజ్య యుద్ధానికి నాంది?
ట్రంప్ ప్రభుత్వం మంగళవారం నుండి చైనా దిగుమతులపై అదనపు 10% సుంకాన్ని అమలు చేసింది. దీనికి తోడు కెనడా, మెక్సికో , భారత్ తో సహా ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపైనా ఇదే విధమైన చర్యలు చేపట్టింది. ట్రంప్ ప్రకటన ప్రకారం, ఏప్రిల్ 2 నుంచి మరిన్ని పరస్పర సుంకాలు, ఇతర ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
"ఇతర దేశాలు దశాబ్దాలుగా అమెరికాపై అధిక సుంకాలను విధిస్తున్నాయి. ఇప్పుడా దేశాలపై మనం అదే విధంగా స్పందించే సమయం ఆసన్నమైంది" అంటూ ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రకటించారు. చైనా, యూరోపియన్ యూనియన్, భారతదేశం, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాలు అమెరికన్ ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ప్రభావం ఎవరిపై?
ఈ నిర్ణయంతో ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైతే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన ఈ రెండు దేశాలపై మాత్రమే కాదు, ప్రపంచ దేశాలపైనా తీవ్ర ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications