కేంద్రానికి హెచ్చరిక: రూ.2000 నోటులో ఫీచర్లు కాపీ చేసిన పాక్, కానీ..
రూ.2000 నోటు నుంచి ఎనిమిది నుంచి 10 సెక్యూరిటీ ఫీచర్స్ను పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ విజయవంతంగా కాపీ చేయగలిగిందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)
కరాచీ: రూ.2000 నోటు నుంచి ఎనిమిది నుంచి 10 సెక్యూరిటీ ఫీచర్స్ను పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ విజయవంతంగా కాపీ చేయగలిగిందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), జాతీయ దర్యాఫ్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ- ఎన్ఐఏ) కేంద్రాన్ని హెచ్చరించింది.
సెక్యూరిటీ ఫీచర్స్ను కాపీ చేయగలిగిన ఐఎస్ఐ రూ.2000 డూప్లికేట్ నోట్లను తయారు చేస్తుందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అవినీతి, నల్లధనం, నకిలీ నోట్ల అంతానికి కేంద్రం పెద్ద రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాటిని రద్దు చేసి కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను తెచ్చింది.
అయితే, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని పాకిస్తాన్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ మరో ఎత్తుగడకు యత్నిస్తోంది. భారత్లో దొంగ నోట్లను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది.
ఆ పేపర్ దక్కకుండా చూడండి
ఐఎస్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలు నకిలీ నోట్లను తయారు చేయటంలో నిమగ్మమయ్యాయని, అయితే ఆర్బీఐ వాడే పేపర్ నాణ్యతను అవి అందుకోలేకపోయాయని వెల్లడించాయి. నోటు ముద్రణ కోసం ఆర్బీఐకి పేపర్ సరఫరా చేస్తున్న కంపెనీల నుంచి ఐఎస్ఐ ఆ పేపర్ను దక్కించుకోకుండా ఉండేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించాయి.
గత వారం పశ్చిమ బెంగాల్లోని మాల్దా ప్రాంతంలో ఎన్ఐఏ, బీఎస్ఎఫ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టి నకిలీ రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకున్నాయి. పాక్లో తయారు చేసిన ఈ నోట్లను బంగ్లాదేశ్ గుండా దేశంలోకి తీసుకొచ్చేందుకు ఐఎస్ఐ ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్కు పంపించే పేపర్, సిరా కోసం ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ప్రయత్నాలు చేశాయని గతంలో ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. నకిలీ నోట్లు తయారు చేసేందుకు ఐఎస్ఐ కరాచీ శివార్లలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. దీనికి దావుద్ గ్యాంగ్ పూర్తి సహకారం అందిస్తోందని వివరించారు.