వాషింగ్టన్ లో దాడులు చేస్తాం: ఇస్లామిక్ స్టేట్
కైరో: ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికాతో పాటు ఇతర దేశాల్లో తాము దాడులు చేసి తగిన బుద్ది చెబుతామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు హెచ్చరించారు. తమకు వ్యతిరేకంగా దాడులు చేస్తున్న అన్ని దేశాలకు ప్యారిస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
సోమవారం ఇస్లామిక్ స్టేట్ ఉపయోగించే ఓ వెబ్ సైట్ లో ఓ వీడియో దర్శనం ఇచ్చింది. ఆ వీడియోలో తలపాగ పెట్టుకున్న ఓ వ్యక్తి తాను అల్జెరియన్ అల్ గరీబ్ అంటూ పరిచయం చేసుకున్నాడు. సిరియాలో తమ ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో అగ్రరాజ్యాలు వైమానిక దాడులు చేస్తున్నాయని ఆరోపించాడు.
అగ్రరాజ్యాలు జరుపుతున్న వైమానిక దాడులను క్రూసెడర్ క్యాంపెయిన్ గా అభివర్ణించాడు. అంతే కాకుండా క్రూసెడర్ క్యాంపెయిన్ చేస్తున్న దేశాలకు తాము త్వరలోనే దాడులు చేసి బుద్ది చెబుతామని హెచ్చరించాడు.
దేవుడి అనుగ్రహం ఉంది కనుకే తాము ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో దాడులు చేశామని, దేవుడు తమకు అన్ని విధాల సహకరిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అమెరికా కేంద్రబిందువైన వాషింగ్టన్ తో పాటు పలు దేశాల రాజధానులలో త్వరలోనే తాము ప్యారిస్ తరహా దాడులు చేస్తామని అతను హెచ్చరించాడు.
అయితే ఆ వీడియోను సోమవారం అప్ లోడ్ చేశారు. అతను మాట్లాడుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని అమెరికా అధికారులు అంటున్నారు. అమెరికాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చెయ్యకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.