2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) నినాదంతో అక్రమ వలసదారులను రికార్డు స్థాయిలో బహిష్కరించారు. ప్రపంచ దేశాలపై సుంకాలు విధించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కాల్పుల విరమణ, గాజా శాంతి ప్రణాళిక లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే భారత్- పాకిస్థాన్, ఆర్మేనియా- అజర్ బైజాన్, ఇరాన్- ఇజ్రాయెల్ ఇలా అనేక దేశాల మధ్య సంధి కుదుర్చినట్లు చెప్పుకున్నారు.
ఇలా అనేక వివాదాస్పద నిర్ణయాలకు అమెరికా అధ్యక్షుడు కేరాఫ్ అడ్రస్ గా మారారు. అందువల్లనే అమెరికాలో ట్రంప్ లాంటి నాయకులకు వ్యతిరేకంగా నో కింగ్స్ లాంటి నిరసన ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటీవలికాలంలో నో కింగ్స్ నిరసనలు ఉద్ధృతం అయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో తదుపరి అధ్యక్షుడు ఎవరు..? అన్న ప్రశ్న ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే 2028 లో అమెరికా అధ్యక్షుడిగా జేడీ వాన్స్ కు అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న జేడీ వాన్స్ .. తన రిపబ్లికన్ పార్టీ నుంచి 2028 అమెరికా అధ్యక్ష పదవికి నామినేషన్ వేసే నాయకుల్లో ముందు ఉన్నారని కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్(CPAC) తాజాగా నిర్వహించిన స్ట్రా పోల్ లో స్పష్టం అయింది. ఈ పోల్ లో హాజరైన వారిలో జేడీ వాన్స్ కు 53 శాతం మంది మద్దతు తెలిపారు. దీంతో వాన్స్ తొలి స్థానంలో ఉన్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రిపోర్టర్ కెల్లెన్ బ్రోనింగ్ తెలిపారు.

ఈ లిస్టులో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో రెండో స్థానంలో నిలిచారు. అతనికి 35 శాతం మంది నేతలు మద్దతు ఇచ్చారు. ఇక మూడో స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీ సాంటిస్, ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ నిలిచారు. ఇక అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే అమెరికాలో జన్మించిన వారై ఉండాలి. అలాగే కేవలం రెండు సార్లు మాత్రమే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ట్రంప్ ఇప్పటికే రెండోసారి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆయన మరోసారి పోటీ చేసే వీలు లేదు.
ఇక భారత్ తో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కు సత్సంబంధాలు ఉన్నాయి. భారత్ ను ఎప్పుడూ అమెరికాకు సరైన భాగస్వామిగా భావిస్తూ వచ్చారు వాన్స్. జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ తల్లిదండ్రులు ఏపీకు చెందినవారు కావడం విశేషం. గతేడాది జేడీ వాన్స్ దంపతులు భారత్ లో పర్యటించారు. నాలుగు రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.












Click it and Unblock the Notifications