ఖైదీని కౌగిలించుకున్న మహిళా జడ్జి: కారణమిదే!
మియామీ: న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ.. అనుకోని విధంగా ఖైదీగా శిక్ష అనుభవించిన అనంతరం ఎదురుపడిన తన చిన్ననాటి స్నేహితుడిని ఆనందంతో కౌగిలించుకున్నారు. ఈ అరుదైన ఘటన మియామీలోని ఓ కోర్టులో మంగళవారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దోపిడీ కేసులో నిందితుడుగా ఉన్న ఆథర్ బూత్ అనే వ్యక్తి కోర్టుకు వచ్చాడు. అయితే అక్కడ జడ్జిగా ఉన్న మహిళ మిండి గ్లేజర్ ఆ నిందితున్ని చూడగానే తన చిన్ననాటి స్నేహితుడిగా గుర్తించి పలకరించారు.
అంతే.. నిందితుడుగా నిలుచున్న ఆథర్ ఆ మహిళా జడ్జిని గుర్తుపట్టి పశ్చాత్తాపంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలి స్థానాన్ని.. తన ప్రస్తుత పరిస్థితిని తలుచుకొని కుంగిపోయాడు.

ఆ జడ్జి మాత్రం.. మనం అప్పుడే వయసులో ఎంత పెద్ద వాళ్లమైపోయామో తలచుకుంటే బాధగా ఉందంటూ నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ, అతను అదేమీ పట్టించుకోకుండా కన్నీటి పర్యంతమయ్యాడు.
'మేమిద్దరం కలిసి చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడుకునే వాళ్లం, మా స్కూల్ పిల్లలందరిలో ఆథర్ చాలా మంచివాడు' అని ఆ మహిళా జడ్జి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులన్నింటి నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడు నీతిమంతమైన జీవితాన్ని గడపాలని ఆ జడ్జి అప్పుడు ఆకాంక్షించారు. కాగా, దోపిడీ కేసులో అతనికి జైలు శిక్ష పడింది.
శిక్ష పూర్తవడంతో పది నెలల తర్వాత మంగళవారం జైలు నుంచి ఆథర్ విడుదలయ్యాడు. అతడిని కలవడానికి జస్టిస్ గ్లేజర్ జైలుకు వెళ్లారు. తన చిన్ననాటి స్నేహితుడు ఆథర్ కనబడగానే ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆథర్ ఇక నుంచి పరులకు ఉపకారం మాత్రమే చేస్తాడని జస్టిస్ గ్లేజర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, జడ్జి గ్లేజర్ తనకు మార్గదర్శకురాలని ఆథర్ తెలిపాడు.












Click it and Unblock the Notifications