కిమ్ దేశంపై బెలూన్ బాంబుల వర్షం.. సంకరజాతి కుక్కలంటూ చెల్లెలి ఫైర్.. ఆత్మరక్షణలో సౌత్..
యుద్ధవిమానం నుంచి బాంబులు వదిలేసినట్లుగా.. ఉత్తర కొరియా భూభాగంపై ప్రస్తుతం బెలూన్ల వర్షం కురుస్తోంది. ఆ బెలూన్ల ద్వారా లక్షల కొద్దీ కరపత్రాలు.. ఇళ్లు, రోడ్లపైకి వచ్చి పడుతున్నాయి. ఆ కరపత్రాల నిండా నార్త్ వ్యతిరేక రాతలే. తన నియంతృత్వంతో ప్రజల్ని అణిచేస్తోన్న కిమ్ జాంగ్ ఉన్.. అణుబాంబులతో ఆటాడుకుంటున్న తీరు.. తద్వారా మానవాళికి పొంచి ఉన్న ముప్పును కరపత్రాల్లో పొందుపర్చారు. ఉత్తరకొరియా విముక్తి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దీనిపై కిమ్ చెల్లెలు కిమ్ యో జాంగ్ అసాధారణ వార్నింగ్ జారీ చేశారు.

ఇంతకీ పంపిందెవరు?
దక్షిణ కొరియాకు చెందిన కొన్ని గ్రూపులు.. సరిహద్దు కంచెపై నుంచి గ్యాస్ బెలూన్లను నార్త్ లోకి పంపాయి. ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతోన్న ఉత్తర కొరియన్లకు వాళ్ల అధినేత కిమ్ గురించిన నిజాలు తెలియజేయడానికే కరపత్రాలను పంపినట్లు ‘‘ఫ్రీ నార్త్ కొరియా'' ఉద్యమ సంస్థ ప్రకటించింది. ఇలాంటివే పదుల కొద్దీ సంస్థల్లో ఉత్తరకొరియా నుంచి తప్పించుకొచ్చిన(డిఫెక్టర్లు) చాలా మంది యాక్టివ్ గా పనిచేస్తున్నారు.

అన్నకు బదులు చెల్లెలు..
గడిచిన కొద్ది గంటలుగా.. కరపత్రాలను కూర్చిన వేల కొద్దీ గ్యాస్ బెలూన్లు ఉత్తర కొరియా భూభాగంపైకి వచ్చిపడుతుండటాన్ని కిమ్ సర్కారు సీరియస్ గా తీసుకుంది. అయితే, సాధారణంగా విదేశాలకు వార్నింగ్ ఇచ్చే పనిని కిమ్ స్వయంగా చేస్తుంటారు. ఈసారి మాత్రం ఆయనకు బదులగా చెల్లెలు కిమ్ యో జాంగ్ రంగంలోకి దిగారు. నార్త్ రక్షణ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే కిమ్ యో.. కనీవినీ ఎరుగని స్థాయిలో డిఫెక్టర్లపై, వాళ్లకు ఊతమిస్తోన్న సౌత్ కొరియాపై మండిపడ్డారు.

ద్రోహులు.. కుక్కలు..
‘‘మాతృదేశం నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటూ.. జన్మభూమికే హాని తలపెట్టాలని కొందరు ద్రోహులు కుట్రలు చేస్తున్నారు. ఈ ఫిరాయింపుదారుల మూర్ఖత్వం ప్రపంచానికి తెలుసో లేదో! వట్టి మురికి వెధవలు.. సంకరజాతి కుక్కలకు వాళ్లకు ఏమాత్రం తేడా లేదు. బిస్కెట్లు పడేసే యజమానుల కోసమే ఆ కుక్కలు ఇలా మొరుగుతున్నాయి. కానీ మీరు, మీ యజమానులు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.. ఎవరి జోలికెళితే అయిపోతారో వాళ్లనే కెలుకుతున్నారు..'' అంటూ కిమ్ యో జాంగ్ సంచలన ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు..

సౌత్ సర్కారు బెంబేలు..
నార్త్ ఫిరాయింపుదారులకు అండగా ఉంటోన్న సౌత్ కొరియాకు సైతం కిమ్ యో నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి బెలూన్ల బాగోతాలకు ఊతమిస్తే వ్యాపార, వాణిజ్య సంబంధాలను కూడా పూర్తిగా తెంచేసుంటామని, రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని మర్చిపోవాల్సి వస్తుందని, అవసరమైత ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు అమె స్పష్టం చేశారు. కిమ్ చెల్లెల్లి ప్రకటనతో సౌత్ కొరియా సర్కారు ఒకింత ఆత్మరక్షణలో పడింది. కరపత్రాలతో కూడిన బెలూన్లు ఎగరేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతోపాటు మొత్తంగా బెలూన్ల ఎగరవేతపైనే నిషేధం విధిస్తామని సౌత్ కొరియా ప్రభుత్వ అధికార ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

గతంలోనూ ఇలాగే..
నిజానికి సౌత్ సరిహద్దుల నుంచి నార్త్ లోకి బెలూన్లు వచ్చి పడటం ఇది కొత్తేమీకాదు. అయితే గతంలో తేలికపాటి నిత్యావసరాలు, చాకెట్లు, గ్రీటింగ్ కార్డులు తదితర వస్తువుల్ని మాత్రమే వచ్చిపడేవి. ఈసారి మాత్రం ఏకంగా కిమ్ దురాగతాలను పేర్కొంటూ రాసిన కరపత్రాలు పంపడంతో వివాదం పెద్దదైంది. బెలూన్లను పంపిన ‘‘ఫ్రీ నార్త్ కొరియా'' ఉద్యమకర్త పార్క్ సాంగ్ హాక్ మీడియాతో మాట్లాడుతూ.. బానిసలాగా బతకడం ఇష్టంలేకే నార్త్ కొరియా నుంచి బయటికొచ్చేశారని, దేశాన్ని కిమ్ కబందహస్తాల నుంచి విముక్తి చేయడానికి తన వంతుగా పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications