కుక్క మాంసంతో సూప్.. వడ దెబ్బకి విరుగుడు? కిమ్ సంచలన ఆదేశాలు
కొరియన్ ద్వీపకల్పంలో ఎండలు మండిపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటేసి, ప్రజలను ఉక్కపోతతో అల్లాడిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు భానుడి ప్రచండ ప్రతాపానికి అల్లాడుతున్న పౌరులకు ఉత్తర కొరియా సర్కార్ ఒక విచిత్రమైన ఉచిత సలహా ఇచ్చింది. వేసవి వేడిని, ఎండదెబ్బను తట్టుకోవాలంటే ప్రత్యేకంగా కుక్క మాంసంతో తయారు చేసే సూప్ తాగాలని అక్కడి అధికారిక మీడియా ప్రచారం చేయడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర కొరియా దిశానిర్దేశం చేసే అధికారిక పత్రికలో ఈ వివరాలను ప్రచురించారు. విపరీతమైన ఎండల వల్ల గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆ దేశానికి చెందిన ప్రముఖ వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి విరుగుడుగా శరీరానికి చలువ చేసే పుచ్చకాయలు, పెసలు, దోసకాయలతో పాటు పౌష్టికాహారం కింద కుక్క మాంసపు సూప్, చేపల గంజి, ఎర్రటి బొబ్బర్ల గంజి తీసుకోవాలని సూచిస్తున్నారు. అక్కడి స్థానిక భాషలో 'దాంగోగి గుక్' అని పిలిచే ఈ కుక్క మాంసం సూప్ శరీరానికి శక్తినిస్తుందని వారి నమ్మకం.

సామాన్యులకు అందని ద్రాక్ష..
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ప్రభుత్వం ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్న ఈ 'కుక్క మాంసం సూప్' రేటు అక్కడ ఆకాశాన్ని తాకుతోంది. పేదరికంతో సతమతమయ్యే సాధారణ ఉత్తర కొరియా పౌరులకు ఇది కొనుగోలు చేయడం అసాధ్యమనే చెప్పాలి. కేవలం ధనవంతులు, ఉన్నతాధికారులు మాత్రమే దీనిని తినగలరు. నిజానికి దశాబ్దాలుగా ఉత్తర కొరియాలో కుక్క మాంసాన్ని తమ సాంప్రదాయ వంటకంగా ప్రచారం చేస్తూ ఏటా ప్రత్యేక వంటకాల పోటీలను కూడా నిర్వహిస్తుండటం గమనార్హం.
పొరుగు దేశంలో నిషేధం.. ఇక్కడేమో ప్రోత్సాహం!
ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల వైఖరిలో పూర్తి వైరుధ్యం కనిపిస్తోంది. దక్షిణ కొరియా ఇప్పటికే కుక్కల పెంపకం, కోత, విక్రయాలపై కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షలు, కోట్లాది రూపాయల జరిమానాలు విధిస్తున్నారు. కానీ ఉత్తర కొరియా మాత్రం తీవ్ర వేడి, 70 శాతానికి పైగా ఉన్న వేసవి తాపం నుంచి తట్టుకోవడానికి ఈ వింత వంటకాలను తిని తీరాల్సిందేనని ప్రజలకు నూరిపోస్తుండటం విశేషం.














Click it and Unblock the Notifications